రిజర్వాయర్లో దూకి 8మంది ఆత్మహత్యాయత్నం: ఇద్దరు మృతి, ముగ్గురు గల్లంతు
కర్నూలు: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. కాగా, ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా అవుకు జలాయశం వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు మండలం కిష్టిపాడుకు చెందిన రామయ్యకు ఇద్దరు కుమారులు వెంకటేశ్వర్లు(52), లక్ష్మీనారాయణ. వీరు కొంత కాలంగా శనగల వ్యాపారం చేస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన శనగలను వేరొక వ్యాపారికి విక్రయిస్తుంటారు. అతను డబ్బులు చెల్లించకపోవడంతో అప్పులు పెరిగాయి.
మరోవైపు రైతుల నుంచి ఒత్తిడి పెరగడంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సొంత వాహనంలో తండ్రి రామయ్య, కుమారుడు వెంకటేశ్వర్లు(52), ఆయన భార్య రుక్మిణి(45), పిల్లలు భవేశ్(5), సాహితి(3), మరో కుమారుడు లక్ష్మీనారాయణ, ఆయన భార్య భారతి, అతని పిల్లలు మణిదీప్(2)లు అవుకు జలాశయానికి చేరుకున్నారు.

పక్కనే ఉన్న పెద్దమ్మ తల్లికి పూజలు చేశారు. ఆ తర్వాత అందరూ కలసి అవుకు జలాశయంలో దూకి ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో రామయ్య, లక్ష్మీనారాయణ, చిన్నకోడలు భారతి బతికి బయటపడ్డారు.
పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు, ఈయన కుమార్తె సాహితి మృతదేహాలు లభ్యమయ్యాయి. పెద్దకోడలు రుక్మిణి, మనవడు భవేశ్, మణిదీప్ల మృతదేహాల కోసం జలాశయంలో పోలీసులు గాలిస్తున్నారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications