ఎపికి కేంద్ర బృందం వచ్చేస్తోంది: రికార్డులు సరిచేసేందుకు సిబ్బంది తంటాలు
అమరావతి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేంద్రం అమలు చేస్తున్న చక్కటి పథకం...గ్రామసీమల్లో కోట్లాదిమంది నిరుద్యోగ నిరుపేద కూలీలకు పట్టెడన్నం పెట్టడంతో పాటు శాశ్వత ప్రయోజనకర ఆస్తుల్ని నిర్మించడం కోసం ఉద్దేశించిన మహోన్నత కార్యక్రమం.2006లో అమల్లోకొచ్చిన ఎంజిఎన్ఆర్ఈజిఎస్ పథకం సాధించిన విజయాలు అసామాన్యమైనవి.
అయితే ఇంత మంచి పథకం కొందరు అక్రమార్కుల చేతివాటం, అవినీతి అధికారుల తోడ్పాటుతో పక్కదారి పడుతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నీ ఈ సంక్షేమ పథకం అమలును వీరు తమకు లాభసాటి వ్యవహారంగా మలుచుకోవడంతో అసలు ఉద్దేశ్యం దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. తమ బృందాలను తనిఖీలకు పంపుతోంది. అలా రాష్ట్రంలో ఉపాధి హామీ పనులను,రికార్డులను తనిఖీ చేసేందుకు ఈ నెలలో రాష్ట్రంలో పర్యటించబోతోంది.
పథకం విజయం...
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభంలో సక్రమంగా అమలు కావడం వల్ల గ్రామీణ పేదలకు అనేక ప్రయోజనాలు సమకూరాయి. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లోని నిరుపేదలు ఏడాదికి వంద రోజులపాటు ఉపాధిని పొందగలిగారు. ఉన్న ఊరునూ అయినవారినీ వదిలిపెట్టి పనుల కోసం వలస వెళ్లే అవసరం లేకుండా ఉన్నచోటనే పని దొరికింది. ముఖ్యంగా మహిళలకు ఈ పథకం ఆర్థిక భద్రత కల్పించింది. కరువు రోజుల్లో, పనులే లేని సీజన్లో ఆసరాగా నిలిచింది. ఈ పథకం అమలు మొదలయ్యాక శ్రామికులకు డిమాండు పెరిగి బయటి పనుల్లో వారి వేతనాలు మెరుగయ్యాయి. అంతేకాదు ప్రపంచంలోనే తొలిసారి అమలుచేసిన సామాజిక భద్రతా పథకమని ఎందరో కీర్తించారు. ప్రపంచబ్యాంకు సైతం దీన్ని మెచ్చుకుంది
పథకం పక్కదారి...
ఈ పథకానికి నిథుల రాక ఎక్కువగా ఉండటంతో అక్రమాలు మొదలయ్యాయి. పనుల్లో యంత్రాల వినియోగం పెంచి శ్రామికుల పొట్టగొట్టడం మొదలైంది. బినామీ కాంట్రాక్టర్లు వెలిశారు. చేపడుతున్న పనులేమిటో, అవి ఎంతవరకూ అవసరమో పర్యవేక్షించే యంత్రాంగం కుంటుబడింది. దీనికి కేటాయించిన నిధుల్ని కొన్ని ప్రభుత్వాలు సైతం దారిమళ్లించాయి. ఈ పదేళ్లలో పథకంపై వ్యయమైన రూ. 3.40 లక్షల కోట్లుకు దీటుగా సామాజిక ఆస్తుల సృష్టి జరిగిందా అన్న సందేహాలున్నాయి. కోట్లాది రూపాయలు వ్యయమయ్యే పథకంలో అవినీతిపరులు ప్రవేశించడం, నిధులు స్వాహా చేయాలని చూడటం మామూలే.
కేంద్ర బృందాల తనిఖీ...
ఉపాథి హామీ పథకంలో అక్రమాలను వెలికి తీసేందుకు కేంద్ర బృందాలు అన్ని రాష్ట్రాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నాయి. ఏ రాష్ట్రంలో ఉపాథి హామీ పథకంలో అక్రమాలు ఎక్కువగా చోటుచేసుకుంటే ఆ రాష్ట్రాలకు నిధుల మంజూరులో కోత విధించడం జరుగుతోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు రికార్డుల క్రమబద్దీకరణకు ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితి ఉంది.
కేంద్ర బృందం రాక...
ఈ నేపథ్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, రికార్డుల తనిఖీకి కేంద్ర బృందం ఈనెలలో రాష్ట్రానికి రానుంది. డిసెంబర్ 18 నుంచి 26 వరకూ కేంద్ర బృందం ఎపిలో పర్యటించనుంది. నలుగురు సభ్యులతో కూడిన ఈ కేంద్ర బృందం ముందుగా కృష్ణా, గుంటూరు జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచారం.
సిబ్బంది హడావుడి
నలుగురు సభ్యుల కేంద్ర బృందం రానుండటంతో గ్రామీణాభివృద్ధి అధికారులు అప్రమత్తమయ్యారు. క్షేత్ర స్థాయిలో చేపట్టిన పనులు, రికార్డులు పనులు చేసిన చోట్ల బోర్డులు తదితర చర్యలు తీసుకోవాలని వారు జిల్లాలకు ఆదేశాలు పంపారు.ఈ బృందం ముందుగా కృష్ణా, గుంటూరు జిల్లాలో పర్యటించనుంన్న సమాచారంతో ఈ రెండు జిల్లాల్లోని కార్యాలయాల్లో హడావుడి ఎక్కువగా ఉంది. అధికారులు సిబ్బందితో రికార్డులను సరిజేయిస్తున్నారు.
దిద్దుబాటు చర్యలు...
రికార్డుల క్రమబద్దీకరణకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని మండలాల్లో టెక్నికల్ అసిసెంట్ పోస్టులు ఖాళీగా ఉండటంతో రికార్డులు నిర్వహించలేదని సమాచారం. దీంతో ఈ బాధ్యతను పక్క మండలాల సిబ్బందికి అప్పగించారు. విజయవాడ, గుంటూరు నగరాలకు సమీపంలోని మండలాల్లోనే చాలా గ్రామాల్లోనూ రికార్డులు తాజా సమాచారంతో లేవు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఒక మండలంలో గత ఏడాది వరదల్లో మండల పరిషత్ కార్యాలయంలోకి నీళ్లు రావడంతో రికార్డులు తడిసి పోయి, రికార్డులేవీ అందుబాటులో లేవని తెలుస్తోంది
నిధుల్లో కోత...
ఎక్కడైనా రికార్డులు సక్రమంగా లేకపోతే దాని ఫలితం రాష్ట్ర ప్రభుత్వం పై పడుతుంది. రికార్డుల పై కేంద్ర బృందం సెంట్రల్ గవర్నమెంట్ కు నెగటివ్ రిపోర్టు ఇచ్చినట్లయితే ఈ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన నిధుల మంజూరులో కోత పడిపోతుంది. గత ఏడాది ఈ విధంగా ఆంధ్ర ప్రదేశ్ కు కూడా ఉపాథి హామీ పథకం నిధుల మంజూరు తగ్గించిన సంగతి తెలిసిందే. కారణం గత ఏడాది ఎపిలో రికార్డుల పరిశీలనకు వచ్చిన కేంద్రం బృందం సభ్యులు కర్నూలు జిల్లాలో తనిఖీలు నిర్వహించి లోపాలపై కేంద్రానికి నివేదిక ఇచ్చారు. అప్పటి నుంచే కేంద్రం ఉపాధి హామీ నిధుల విడుదలను తగ్గించినట్లు వాదనలున్నాయి.