ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య: అనుమానాలు
చిత్తూరు: జిల్లాలోని తిరుపతి తుమ్మలకుంటలోని నారాయణ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కడప(వైయస్సార్) జిల్లా రైల్వేకోడూరుకు చెందిన రేఖ అనే యువతి.. ఇంటర్ మొదటి చదువుతోంది. సోమవారం రాత్రి ఆమె కళాశాల హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది.
కాగా, మృతురాలి తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె మృతురాలి తల్లిదండ్రులు మాత్ర తమ కుమార్తె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే రేఖ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
కళాశాల యాజమాన్యం సోమవారం రాత్రి ఒంటిగంట సమయంలో ఫోన్ చేసి రేఖ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పారని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. తాము కళాశాల వద్దకు వచ్చేసరికి ఇక్కడ యాజమాన్యానికి సంబంధించిన వారు ఎవరూ లేరని అన్నారు.
తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికి కాదని, ఆమె శరీరంపై ఉరివేసుకుని చనిపోయిన ఆనవాళ్లు లేవని మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తమ కూతురుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు లేవని వారు చెప్పారు. రేఖ తలను బలంగా గోడకేసి కొట్టి ఉండటం వల్లే చనిపోయి ఉంటుందని అన్నారు. ఎంఆర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల మృతి
బెంగళూరు-చెన్నై నాల్గో నంబరు జాతీయ రహదారిలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. కర్ణాటక రాష్ట్రం కోలారుకు చెందిన సాజ్(23), సుజీ(22) యాదమరి మండలం పేరకూరులోని బంధువుల ఇంటికి బైకుపై వస్తున్నారు. మార్గమధ్యలో మొగిలిఘాట్ రోడ్డు వద్దకు చేరుకోగానే.. చిత్తూరు నుంచి పలమనేరు వైపునకు వెళుతున్న ఆర్టీసీ బస్సును వీరి బైకు ఢీకొట్టింది.
ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న సాజ్, సుజీ అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్సై ఉమామమహేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను బంగారుపాళ్యం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పటించారు.