అనుమానంతో గొంతుకోసి కూతురి హత్య: తండ్రి అరెస్ట్
గుంటూరు: కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న కూతురును అత్యంత దారుణంగా గొంతుకోసి చంపిన కసాయి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని చిలకలూరి పేట మండలం లింగంగుంట్ల గ్రామంలో చోటు చేసుకుంది. మార్చి 18న కదలలేని స్థితిలో ఉన్న కన్నకూతురు మహేశ్వరి(9)ని ఆమె తండ్రి కండూరి తిరుపతయ్య హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం వెంగళాయపాలెం గ్రామానికి చెందిన తిరుపతయ్య 15ఏళ్ల క్రితం ఉపాధి కోసం లింగంగుంట్ల గ్రామానికి వచ్చాడు. అతనికి భార్య, ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆడపిల్లల్లో ఇద్దరికి పెళ్లి చేశాడు. పెద్ద కొడుకును పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు పంపాడు.
ఇంటి వద్ద చిన్న కొడుకు పవన్, చిన్న కూతురు మహేశ్వరి ఉంటున్నారు. కాగా, రోజు మద్యం తాగి వచ్చి భార్యా, పిల్లలను వేధించేవాడు తిరుపతయ్య. కొంత కాలం క్రితం తిరుపతయ్య అనుమానంతో తన భార్యపై కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే చిన్న కూతురు మహేశ్వరిపై దాడి చేసి బండకేసి కొట్టాడు. దీంతో ఆమె అప్పట్నుంచి కదల్లేని స్థితిలో ఉంది.
కాగా, ఏప్రిల్ 18న భార్య, చిన్న కొడుకు పవన్పై తిరుపతయ్య దాడి చేయబోగా వారు తప్పించుకున్నారు. కదల్లేని స్థితిలో ఉన్న కూతురుపై దాడి చేశాడు. ‘నాన్న నన్ను చంపొద్దు' అని ఆ బాలిక వేడుకున్నా.. వినకుండా అత్యంత కిరాతకంగా ఆమె గొంతుకోసి చంపేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బుధవారం నిందితుడు తిరుపతయ్యను అరెస్ట్ చేశారు.