ఎపి కేబినెట్లోకి ముస్లిం మంత్రి... దాదాపు ఖరారు:ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్ కి ఛాన్స్!
Recommended Video

అమరావతి:ఎపి మంత్రిమండలిలో తాజాగా ఒక ముస్లిం నేతకు స్థానం లభించడం ఖాయంగా కనిపిస్తోంది. సిఎం చంద్రబాబు ఈ విషయమై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు బిజెపి మంత్రులు రాజీనామా చేయడంతో కేబినెట్ లో రెండు ఖాళీలు ఏర్పడగా వాటిని ఇప్పటివరకు భర్తీ చేయలేదు. అయితే ఇందులో ఒకటి ముస్లిం మైనారిటీలకు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా నిర్ణయంగా తెలుస్తోంది. అయితే టిడిపి నుంచి నేరుగా ఎమ్మెల్యేగా ముస్లిం మైనారిటీ అభ్యర్థి ఎవరూ లేకపోవడంతో ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్కు మంత్రి పదవి ఇవ్వాలని సిఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది.

మారిన పరిణామాలు...కలిసొచ్చాయి
రాష్ట్రంలో గతకొంత కాలంగా రాజకీయ పరిణామాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటుండటం వివిధ సామాజిక వర్గాలకు బాగా కలిసి వస్తోంది. బిజెపి, పవన్ కల్యాణ్ టిడిపికి దూరం కావడంతో వివిధ సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా సామాజిక వర్గాలకు కొత్త కొత్త సంక్షేమ పథకాలు, వరాలు ఇస్తున్నారు. ఈక్రమంలోనే ముస్లింమైనారిటీ వర్గాలను మరింత ఆకట్టుకునేందుకు చంద్రబాబు ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నట్లు కనిపిస్తోంది.

ఆ క్రమంలోనే...ముస్లిం మంత్రి
గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపితో భాగస్వామ్య పార్టీగా ఉన్న టిడిపి అప్పటి రాజకీయ ప్రాబల్యం వల్ల గానీ, మరో కారణం వలనో గానీ ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి కేటాయించలేదు. అయితే కొన్నాళ్ల క్రితమే బిజెపితో తెగతెంపులు చేసుకోవడం, ఆ క్రమంలో ముస్లిం ఓటు బ్యాంకును మరింత పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకోవడంతో తాజాగా కేబినెట్ లోకి ఒక ముస్లిం మంత్రి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

టిడిపి నుంచి నేరుగా...ఎవరూ లేరు
గతంలో వైసిపి నుంచి టిడిపి లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆ తొలినాళ్లలో తనకు మంత్రి పదవి ఖాయమనే ధీమాలో ఉండేవారు. పైగా అప్పుడు మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందన్న సమయంలోనే జలీల్ ఖాన్ "బికామ్ లో ఫిజిక్స్" ఇంటర్వ్యూ బ్లాస్ట్ కావడం...లేదా మరో కారణం చేతో...ఆయనకు ఆ విడత విస్తరణలో పదవి దక్కలేదు. ఇక ఇప్పటి విషయానికొస్తే టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ముస్లిం ప్రజాప్రతినిథి ఒక్కరు కూడా లేరు. అలాగని వైసిపి నుంచి వచ్చిన ఎమ్మెల్యేకు మళ్లీ మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు.

సమీకరణాలు...ఇవి
ఇప్పటికే వైసిపి నుంచి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం...దానిపై విమర్శల పరంపర...ఇక బిజెపి నేతలైతే రాష్ట్రంలో టిడిపి-వైసిపిల సంకీర్ణ ప్రభుత్వమని ఎద్దేవా చేస్తుండటం ఇత్యాది కారణాలతో సిఎం తాజాగా ముస్లింకు ఇవ్వాలని నిర్ణయించిన మంత్రి పదవి వైసిపి నుంచి చేరిన జలీల్ ఖాన్ కో...చాంద్ భాషాకో ఇచ్చే అవకావమే లేదు. పైగా జలీల్ ఖాన్ కు ఇటీవల రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధ్యక్షునిగా నియమితులైన సంగతి తెలిసిందే. ఇక టీడీపీ నుంచి ఇద్దరు మైనారిటీలు ఎమ్మెల్సీలుగా గెలిచారు. వారిలో ఎన్ఎండీ ఫరూక్ ప్రస్తుతం శాసనమండలి చైర్మన్గా ఉండగా మరో ఎమ్మెల్సీ షరీఫ్ ప్రస్తుతం మండలి నుంచి ప్రభుత్వ విప్గా ఉన్నారు. ఫరూక్ ను ఉన్న పదవిలోనే కొనసాగించి, షరీఫ్ ను మంత్రిని చేస్తే ముస్లిం మైనారిటీలకు రెండు ప్రధాన పదవులు ఇచ్చినట్లవుతుందనేది సిఎం చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.

షరీఫ్ కు లక్కీ ఛాన్స్...ఇలా
ఇక ఫరూక్ రాయలసీమ నేత కాగా షరీఫ్ కోస్తా నాయకుడు. మైనారిటీల సంఖ్య రాయలసీమలో అధికంగా ఉండటంతో ఫరూక్ చేత మండలి చైర్మన్ పదవికి రాజీనామా చేయించి మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ తొలుత పార్టీలో జరిగింది. అలా చేస్తే చైర్మన్ పదవిని మరో సీనియర్కు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు బదులుగా ఫరూక్ ను ఉన్న పదవిలోనే కొనసాగించి, షరీఫ్ ను మంత్రిని చేస్తే ముస్లిం మైనారిటీలకు రెండు ప్రధాన పదవులు ఇచ్చినట్లవుతుందనేది సిఎం చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన షరీఫ్ దీర్ఘకాలంగా పార్టీని అంటి పెట్టుకొని పనిచేస్తున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా అంకిత భావంతో నిర్వహిస్తున్నారు. అందుకే ఆయనను ఈ విధంగా లక్కీ ఛాన్స్ వరించింది. ఇక... ఖాళీగా ఉన్న రెండో మంత్రి పదవిపై సిఎం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలిసింది. దాన్ని భవిష్యత్ అవసరాల కోసం దాచిపెట్టారని భావించవచ్చు.












Click it and Unblock the Notifications