అమెరికాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుమంది మృతి
అమెరికాలో మరోసారి గన్ కల్చర్ గర్జించింది. ఐయోవాలోని మస్కటిన్ టౌన్ రక్తమోడింది. ఈ కాల్పుల ఘటనలో ఏడు ప్రాణాలు గాలిలో కలిశాయి. ఈ విషాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుమందితో పాటు కాల్పులకు పాల్పడ్డ నిందితుడు కూడా మరణించాడు. తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగా ఈ కాల్పులు జరిగాయని పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు చేపట్టారు.
మస్కటిన్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటన ప్రకారం.. ఆ దేశ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 12:12 నిమిషాలకు 210, పార్క్ అవెన్యూలోని ఒక నివాసంలో కాల్పులు జరిగినట్లు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, వైద్య సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే వారంతా మృత్యువాత పడ్డారు. రక్తపుమడుగులో కనిపించారు.

కాల్పులకు పాల్పడ్డ నిందితుడిని మస్కటిన్కే చెందిన 52 ఏళ్ల ర్యాన్ విల్లిస్ మెక్ఫార్లాండ్గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. కాల్పులు జరిగిన గంట సమయంలోనే అతన్ని రివర్ఫ్రంట్ ట్రైల్ వద్ద గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో గుర్తించారు. అతన్ని లొంగిపోవాలని పోలీసులు హెచ్చరిస్తోండగానే.. తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని మస్కటిన్ పోలీసులు వెల్లడించారు.
1509 మిల్ స్ట్రీట్, 808 గ్రాండ్వ్యూ అవెన్యూలో కూడా కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయని, ఈ రెండు చోట్లా కూడా ఇద్దరు మరణించారని, వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్లని పేర్కొన్నారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ దర్యాప్తులో మస్కాటిన్ ఫైర్ డిపార్ట్మెంట్, కౌంటీ షెరీఫ్, ఐయోవా స్టేట్ పెట్రోల్, డివిజన్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వంటి విభాగాలు పాల్గొంటోన్నాయి. దర్యాప్తు సాగుతోందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications