ఏపీలో ఉచిత బస్సుకు ఏడాది..! సర్కార్ కీలక నిర్ణయం..!
ఏపీలో కూటమి సర్కార్ (Ap Govt) మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం (free bus scheme) అమల్లోకి తెచ్చి శనివారంతో ఏడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, స్త్రీ శక్తి పథకం ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు 87 కోట్ల ప్రయాణాలు చేశారని ఈ సందర్బంగా ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది కాలంలో స్త్రీ శక్తి పథకం కోసం రూ.3,095 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. 76 శాతం బస్సులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు.
స్త్రీ శక్తి పథకం రాకముందు ఆర్టీసీ బస్సుల్లో మహిళల వాటా 40 శాతం ఉండగా.. ఇప్పుడు అది 62 శాతానికి పెరిగింది. రోజువారీ మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా 9.47 లక్షల నుంచి 24 లక్షలకు చేరింది. ఈ పథకం అమలవుతున్న బస్సుల్లో ఆక్యుపెన్సీ 93 శాతానికి చేరింది.స్త్రీ శక్తి పథకం మహిళల ప్రయాణ ఖర్చును తగ్గించడం మాత్రమే కాకుండా.. విద్య, ఉపాధి, వైద్యం, వ్యాపారం, ఇతర అవసరాలకు పనికొస్తోంది. కాలేజీలకు వెళ్లే వారికి, చిరు వ్యాపారం నిమిత్తం ఒక ఊరి నుంచి మరొక ఊరు వెళ్లేవారికి, దైవ దర్శనాలకు వెళ్లేవారికి ఉపయోగపడుతోంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇదే తరహా పథకాన్ని 4 కేటగిరి బస్సుల్లోనే అమలు చేస్తుండగా.. ఏపీలో మాత్రం ఐదు కేటగిరీల బస్సులో అమలు చేస్తున్నారు.

ఈ పథకం ప్రవేశపెట్టి ఏడాదైన సందర్భంగా సీఎం చంద్రబాబు శనివారం మహిళలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. "స్త్రీ శక్తికి సంవత్సరం- రెట్టింపైన ఆత్మగౌరవం" పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపట్టనున్నారు. రాజధాని పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవాల అనంతరం "స్త్రీ శక్తికి సంవత్సరం- రెట్టింపైన ఆత్మగౌరవం" కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. పరేడ్ గ్రౌండ్ నుంచి సీఎం క్యాంప్ కార్యాలయం వరకు స్త్రీశక్తి లబ్దిదారులతో కలిసి బస్సులో ఆయన ప్రయాణిస్తారు. క్యాంప్ కార్యాలయంలో మహిళలతో కలిసి హై-టీలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వారి ఫీడ్ బ్యాక్ తీసుకోబోతున్నారు.














Click it and Unblock the Notifications