APPSC Group 1 SIT Report: సిట్ రిపోర్ట్ లో షాకింగ్- మార్కుల గోల్ మాల్- 98 శాతం అక్రమాలే..!
గత వైసీపీ హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష (APPSC Group 1) ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో చోటు చేసుకున్న అక్రమాల్ని తాజాగా ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన సిట్ రిపోర్ట్ బయటపెట్టింది. ఇందులో తమకు కావాల్సిన వారికి కావాల్సిన మార్కులు వేసుకుని, మిగతా అభ్యర్ధులకు చేసిన అన్యాయం, అందుకోసం అనుసరించిన పద్దతులు, వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ లు నిర్ధారించిన రిపోర్ట్ లు చూస్తే కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి.
2018 డిసెంబర్ 31న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష నోటిఫికేషన్ ఇచ్చింది. 2019 మే నెలలో ప్రిలిమ్స్ నిర్వహించగా.. 59205 మంది పరీక్ష రాసి, అందులో 9679 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. 2020 డిసెంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఇందులో 6,807 మంది మెయిన్స్లోని మొత్తం 7 పేపర్లను పూర్తి చేశారు. వీరిలో 326 మందిని షార్ట్ లిస్ట్ చేసి, అందులో 165 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ మధ్యలోనే అంతా జరిగింది. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా ఉన్న ఉదయ్ భాస్కర్ ను పక్కనబెట్టి, కమిషన్ కార్యదర్శిగా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులు సాయంతో అంతా నడిపించారని సిట్ పేర్కొంది.

ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు మెయిన్స్ పరీక్ష పత్రాల్ని డిజిటల్ మూల్యాంకనం చేయించారు. ఇందుకోసం తన కాలేజీ ఫ్రెండ్ ఆకెళ్ల పేరి శ్రీనివాస్ కు చెందిన ట్రూగ్రేడర్ ఎడ్యుసర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఇందుకోసం రూ.1.38 కోట్లను వారికి చెల్లించారు. నిబంధనలకు విరుద్దంగా స్కూల్ టీచర్లు, ప్రైవేట్ కాలేజీ లెక్చరర్లు సహా ప్యానెల్ లో లేని 25 మందితో ఈ డిజిటల్ మూల్యాంకనం చేయించారని సిట్ తెలిపింది. ఆ తర్వాత డిజిటల్ మూల్యాంకానం చెల్లదంటూ హైకోర్టు తేల్చడంతో.. హాయ్ ల్యాండ్ రిసార్ట్స్ లో మాన్యువల్ మూల్యాంకనం చేపట్టారు. ఛైర్మన్ అనుమతి లేకుండా పేపర్లను అక్కడికి తరలించి 84 రోజుల పాటు అక్కడ మూల్యాంకనం చేశారు. ఈ బాధ్యతను పీఎస్సార్ తన మరో మిత్రుడు మధుకు చెందిన కామ్ సైన్ మీడియాకు అప్పగించారు. ఇందుకు రూ. 1.14 కోట్లు చెల్లించారు.
కమిషన్ గుర్తించిన 452 మంది సబ్జెక్ట్ నిపుణుల్ని కాదని, వీరి స్థానంలో 66 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో పేపర్లు దిద్దించారు.
ఇందులో గుట్టుచప్పుడు కాకుండా ఓఎంఆర్ షీట్లను నింపారు. కొన్ని పేపర్లకు అక్కడే బబ్లింగ్ చేయడంతో పాటు ఎగ్జామినర్-1, ఎగ్జామినర్-2, స్క్రూటినైజర్లు, క్యాంప్ ఆఫీసర్ల సంతకాలను ఫోర్జరీ చేశారని సిట్ తెలిపింది. డబ్బులు ఇచ్చిన వారికి మార్కులేశారని కూడా పేర్కొంది. దీనిపైనా అభ్యర్ధులు కోర్టుకు వెళ్తే.. మాన్యువల్ గా మూల్యాంకనం చేయలేదని అఫిడవిట్ ఇచ్చారు. చివరికి మూడోసారి మూల్యాంకనం చేసి అక్కడా అక్రమాలకు పాల్పడినట్లు సిట్ తేల్చింది.

తమ దర్యాప్తులో ఈ పత్రాల్ని సిట్ ఏడు సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ లకు పంపగా.. అక్కడ 736కు గానూ.. 718 మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లలో మార్పులు, చేర్పులు జరిగినట్టు గుర్తించారు. అంటే 97.55 శాతం పత్రాల్లో అవకతవకలు జరిగాయి. ఎంపికైన 165 అభ్యర్థులలో 160 మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లల్లో మార్పులు గుర్తించారు. అంటే 96.97శాతం మేర గోల్ మాల్ చేసినట్లు తేల్చారు ఎంపిక కాని 161 మంది OMR షీట్లను పరిశీలిస్తే.. 153 షీట్లల్లో తేడా జరిగినట్టు సిట్ స్పష్టం చేసింది. అంటే ఇక్కడ కూడా 95.03 శాతం అవకతవకలు జరిగాయి. సెలెక్ట్ అయిన అభ్యర్థుల్లో 89 మంది సంతకాల్లో తేడా గుర్తించారు. సెలెక్ట్ కాని 161 మందిలో 70 మంది సంతకాల్లో తేడాను గుర్తించారు. ఇలా గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అడుగడుగునా అక్రమాలు జరిగినట్లు సిట్ రిపోర్ట్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications