టెక్కీ వరకట్న దాహం: నాల్గో పెళ్లికి సిద్ధమయ్యాడు
హైదరాబాద్: వరకట్న దాహంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పెళ్లి మీద పెళ్లిళ్లు చేసుకుంటూ తన దాహాన్ని తీర్చుకున్నాడు. ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులిచ్చిన ఆ ప్రబుద్ధుడు..
పోలీసుల కథనం ప్రకారం.. గోపాల్పేట్ మండలంలోని జంగమాయపల్లికి చెందిన స్వాతిని హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మల్లిఖార్జున గౌడ్కు భారీగా కట్నా కానుకలిచ్చి ఏడాది క్రితం వివాహం జరిపించారు. వివాహమైన 3 నెలల నుంచే అదనపు కట్నం కోసం ఆమెను వేధింపులకు గురి చేశాడు మల్లిఖార్జున గౌడ్.
అతనికి తోడు అత్తామామ, ఆడపడచు, మరిది తోడయ్యారు. దీంతో వారి వేధింపులు తాళలేని స్వాతి ఇటీవల కుటుంబసభ్యులకు వివరాలు తెలిపింది. దీంతో ఆమె తండ్రి తిరుపతయ్య గౌడ్ శుక్రవారం గోపాల్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన భర్తకు మొదటి భార్య కట్నం వేధింపులు తాళలేక విడాకులిచ్చిందని, ఆ తర్వాత మరో అమ్మాయిని వివాహం చేసుకోగా ఇదే విషయమై ఆమె కూడా విడాకులిచ్చిందని, ఆ తర్వాత తనను వివాహం చేసుకున్నాడని స్వాతి తెలిపింది. తనను కూడా వదిలించుకుని నాలుగో పెళ్లికి సిద్ధమయ్యాడని పిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.