యజమాని చిత్రహింసలు: సౌదీలో రాణెమ్మ అనుమానాస్పద మృతి
ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన మరో తెలుగు మహిళ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. తన యజమాని పెట్టే చిత్రహింసలకు తాళలేక ఆమె మృతి చెందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చిత్తూరు: ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన మరో తెలుగు మహిళ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. తన యజమాని పెట్టే చిత్రహింసలకు తాళలేక ఆమె మృతి చెందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె మృతితో ఆమె కుటుంబంతోపాటు సొంత గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీ కొత్తిండ్లుకు చెందిన మల్లకుంట రఘునాథ భార్య రాణెమ్మ(52) ఉపాధి నిమిత్తం కువైట్కు వెళ్లి వస్తుండేది. అక్కడ ఆమె ఇంటి, వంట పనులు చేస్తుండేది. కొంతకాలం కిందట మదనపల్లెకు వచ్చింది.
అయితే, వారంరోజుల కిందట పీలేరుకు చెందిన ఓ ఏజెంట్ ద్వారా సౌదీకి వెళ్లింది రాణెమ్మ. అక్కడ ఆమె ఓ సేట్(వ్యాపారి) ఇంట్లో పనులు చేసేందుకు కుదిరింది. కాగా, వెళ్లిన రెండురోజులకే సేట్, అతని కుటుంబీకులు తనను నానా చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ బాధితురాలు రెండుమూడు సార్లు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది.
ఎలాగైనా తనను ఇంటికి రప్పించేందుకు ప్రయత్నించాలని వేడుకుంది. దీంతో కుటుంబ సభ్యులు సంబంధిత ఏజెంట్ను సంప్రదించారు. అతడు రూ.1.50 లక్షలు నగదు చెల్లిస్తే స్వగ్రామానికి రప్పిస్తానని చెప్పాడు. రాణెమ్మ కుమారులు చక్రవర్తి, గురునాథ్లు చేసేదిలేక కొంత నగదు తీసుకెళ్లి ఏజెంట్కు ఇచ్చి ఎలాగైనా తమ తల్లిని ఇండియాకు రప్పించాలంటూ వేడుకున్నారు. ఇది ఇలా ఉండగా, సోమవారం తెల్లవారుజామున రాణెమ్మ సౌదీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతిచెందినట్లు సేట్ నుంచి ఫోన్ వచ్చింది.
ఈ వార్త వినగానే రాణెమ్మ కుమారులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రాణెమ్మ అనారోగ్యంతో మృతిచెందినట్లు సేట్ చెప్పడంతో ఆమె కుమారులు అనుమానం వ్యక్తం చేశారు. బాధితురాలు సౌదీలో తీవ్రంగా గాయపడి నడవలేని స్థితిలో వున్న వీడియోలను తీసి కుమారుల సెల్ఫోన్కు పంపింది.
ఈ వీడియోలను చూసిన వారంతా రాణెమ్మ సౌదీలో కొట్టి చంపేశారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన గురించి తెలుసుకున్న ఏజెంట్ సెల్ఫోన్ స్విచ్ఛాప్ చేసి పరారయ్యాడు. బాధితులు ఏజెంట్పై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని, తమ తల్లిని సొంతగ్రామానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని రాణఎమ్మ కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.