మోసగించిన కానిస్టేబుల్: పిఎస్ ఎదుట యువతి ధర్నా
విజయనగరం/నెల్లూరు: జిల్లాలోని సాలూరు మండలంలోని మక్కువకు చెందిన ఓ యువతి స్థానిక పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించింది. రామభద్రాపురం మండలంలోని తారాపురం గ్రామానికి చెందిన తుమ్మరాడ గోవింద అనే ఏఆర్ కానిస్టేబుల్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడని యువతి ఆరోపించింది.
తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈ ఏడాది జూన్లో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగిన తర్వాత అధిక కట్నం కోసం ఆశపడి వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని యువతి పేర్కొంది.
గోవిందతో పెళ్లి జరిపించాలని గతంలోనే జిల్లా ఎస్పీకి, మక్కువ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు అందజేసినా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. యువతికి మద్దతుగా ఐద్వా జిల్లా కార్యదర్శి లక్ష్మీ, ఇతర నేతలు పాల్గొన్నారు.
సిబ్బంది వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
నెల్లూరు: జిల్లాలోని గుత్తికొండ శ్రీరాములు డైట్ కాలేజ్లో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాలేజీ సిబ్బంది వేధింపులు తాళలేక సుభాషిణి అనే విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.