వేటకొడవళ్లతో దాడి: జగన్ పార్టీ నేత దారుణ హత్య
కర్నూలు: జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వసంత రావు(55) దారుణ హత్యకు గురయ్యారు. పాత కక్షల నేపథ్యంలో గుర్తుతెలియని దుండగులు ఆయనపై వేటకొడవళ్లతో దాడి చేసి హతమార్చారు. ఈ సంఘటన శ్రీశైలం రెండో జలవిద్యుత్ కేంద్రం వద్ద చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సున్నిపెంట మండల కేంద్రానికి చెందిన వసంతరావు శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్కు పని నిమిత్తం బయల్దేరారు. ఈ క్రమంలోనే మార్గమధ్యలో కొంతమంది దుండగులు ఆయన కారుపై రాళ్ల వర్షం కురిపించారు.
అనంతరం వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో వసంతరావు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో మహబూబ్నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తమ పార్టీ నేతలపై వరుసగా దాడులు జరగడం పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.