తిరుమలలో నెలరోజుల తర్వాత నేటినుండి మళ్ళీ శ్రీవారికి ఆ విశేషసేవ.. నేడు రద్దీ ఇలా!!
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంక్రాంతి పండుగ శోభ కనిపిస్తుంది. నేటి నుండి స్వామివారికి ఆలయంలో యధా ప్రకారం సుప్రభాత సేవను నిర్వహిస్తున్నారు. జనవరి 16వ తేదీన ఉదయం శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవాన్ని నిర్వహిస్తారు. మధ్యాహ్నం పార్వేట మండపం వద్ద పార్వేట ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
పవిత్రమైన ధనుర్మాసం జనవరి 14వ తేదీ ఆదివారం ముగియడంతో జనవరి 15వ తేదీ సోమవారం నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ ప్రారంభించారు. డిసెంబర్ 17వ తేదీ తెల్లవారుజామున 12.34 నిమిషాలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది.

అయితే జనవరి 14వ తేదీన ధనుర్మాసం పూర్తయింది. దీంతో నేటి నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ యధావిధిగా కొనసాగనుంది. ఇక నేటి సంక్రాంతి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. సంక్రాంతి పండుగకు పెద్ద సంఖ్యలో జనాలు సొంత ఊర్లకు వెళ్లడంతో నిన్న తిరుమలలో కాస్త భక్తులు తగ్గినట్టుగా కనిపించినప్పటికీ నేడు మళ్ళీ కాస్త భక్తుల సంఖ్య పెరిగింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లలో తిరుమల స్వామి వారి దర్శనం కోసం స్వామి వారి భక్తులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి సర్వదర్శనం కోసం భక్తులకు 16 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
ఇదిలా ఉంటే నిన్న తిరుమలలో భోగి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువ జామున ఆలయ మహాద్వారం వద్ద ఆలయ అధికారులు, సిబ్బంది భోగి మంటలు వేశారు . శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులు కూడా తిరుమలలో నిర్వహించిన భోగి ఉత్సవాలలో పాల్గొన్నారు.
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో భోగితేరును తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది. శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు భోగి తేరును దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications