నన్ను జైల్లో పెట్టించే దమ్ముందా: శిల్పా వర్సెస్ భూమా, మంత్రి 'సర్దుబాటు'
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ శిల్పా మోహన్ రెడ్డి మధ్య ఇంకా సర్దుబాటు కాలేదని తెలుస్తోంది. వారి మధ్య సయోధ్యకు మంత్రి కల్పించుకున్నారు.
కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ శిల్పా మోహన్ రెడ్డి మధ్య ఇంకా సర్దుబాటు కాలేదని తెలుస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భూమా వైసిపి నుంచి గెలిచారు. ఆ తర్వాత టిడిపిలో చేరారు. ఇది శిల్పా సోదరులకు మింగుడు పడలేదు.
అయితే, వారి మధ్య ఇప్పటికీ పొంతన కుదరడం లేదని అంటున్నారు. ఇరువురు నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా, శిల్పా మోహన్ రెడ్డి పైన భూమా నాగిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
శిల్పా లాంటి నేతలను వేలమందిని చూశానని, తనను జైలులో పెట్టించడం ఆయన అబ్బ తరం కాదన్నారు. తన మౌనాన్ని చేతగానితనంగా భావించవద్దని, శిల్ప వల్లే కుందు నది ఆక్రమణకు గురైందని తీవ్ర ఆరోపణలు చేశారు. శిల్ప పన్నెండేళ్లలో పన్నెండు ఇళ్లు మంజూరు చేయించలేకపోయారని ఎద్దేవా చేశారు. తాను ఐదు నెలల్లోనే నంద్యాల నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయించానని చెప్పారు.

అంతకుముందు శిల్పా మోహన్ రెడ్డి కూడా భూమా పైన నిప్పులు చెరిగారు. ఇలాగే మాట్లాడితే మీరు ఏఏ వ్యాపారాలు చేస్తారో, ఏ దందా చేస్తున్నారో బహిర్గతం చేస్తానని వ్యాఖ్యానించారు. నంద్యాలకు రూ.450 కోట్లు తెచ్చామని ప్రకటిస్తున్నారని, ఏఏ పనులకు, ఏఏ ప్రాంతంలో ఈ నిధులు కేటాయించారో చెప్పాలన్నారు. ఆలోచించి మాట్లాడాలని, లేదంటే ఊరుకునేది లేదన్నారు.
సయోధ్య కుదిరిందా?
భూమా నాగిరెడ్డి, శిల్పా సోదరుల మధ్య విభేదాల నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు వారి మధ్య సయోధ్య కుదిర్చినట్లుగా తెలుస్తోంది. కలిసికట్టుగా పని చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి అచ్చన్న చెప్పగా.. వారు సరేనని చెప్పారని తెలుస్తోంది. కలిసి పని చేస్తామని హామీ ఇచ్చినట్లుగా కూడా చెబుతున్నారు. భూమా, శిల్పా సోదరుల మధ్య విభేదాలు తొలగిపోయాయని, కలిసి పని చేస్తారని మంత్రి అచ్చన్న చెప్పారు.












Click it and Unblock the Notifications