ఏపీలోని ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన ట్వీట్- డిలెట్
Tirumala, TTD: ఏపీలో ఆలయ పరిపాలనపై Ramana Dikshitulu కీలక వ్యాఖ్యలు
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారు రమణ దీక్షితులు.. రాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆలయ పరిపాలన అధ్వాన్నంగా తయారైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల్లో దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారాయన. కొద్దిసేపటి తరువాత ఆ ట్వీట్ ను డిలెట్ చేశారు.
వణికిన పాకిస్తాన్- పెను సంక్షోభంలో చిక్కుకున్న వేళ..!!
తమిళనాడులో ఆగమ శాస్త్రాల ప్రకారమే ఆలయాల్లో పూజాది కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుందంటూ అక్కడి న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశించడంపై రమణ దీక్షితులు స్పందించారు. తమిళ దినపత్రికల్లో వచ్చిన కథనాలతో కూడిన ఓ ట్వీట్ కు రమణ దీక్షితులు బదలు ఇచ్చారు. ఆగమ శాస్త్రాల్లో పొందుపరిచిన విధంగానే మూలవిరాట్టుకు పూజాదిక కార్యక్రమాలు, నిత్య కైంకర్యాలను నిర్వహించాల్సి ఉంటుందని, దీన్ని ఉల్లంఘించడం సరికాదంటూ తమిళనాడు న్యాయస్థానాలో అక్కడి ప్రభుత్వాన్ని ఆదేశించాయి.
దీనికి సంబంధించిన కథనాలు అక్కడి దినపత్రికల్లో ప్రచరితం అయ్యాయి. తమిళనాడు ప్రభుత్వంపై ఆలయ వ్యవస్థ సాధించిన ఘన విజయంగా దీన్ని అభివర్ణిస్తూ ఓ యూజర్.. ట్వీట్ చేశారు. ఆలయ ఆగమాలను ఎవరూ ఉల్లంఘించకూడదు అంటూ మద్రాస్ హైకోర్టు సూచించిందని పేర్కొన్నారు. హిందువులకు న్యాయం జరిగింది అంటూ చెప్పారు.
దీనిపై రమణ దీక్షితులు స్పందించారు. అలాంటి పరిస్థితులు ఏపీలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఏపీలో దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా పరిపాలన జరుగుతోందని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ అధికారులు, సిబ్బంది- ఆగమ శాస్త్రాలను పూర్తిగా పక్కన పెడుతున్నారని పేర్కొన్నారు.
వాటిని తమకు అనుగుణంగా మార్చుకుంటోన్నారనీ చెప్పారు. తమ సొంత ప్రణాళికల ఆధారంగా స్వామివార్లకు పూజాదికాలను నిర్వహిస్తోన్నారని పేర్కొన్నారు. ఇది సరైంది కాదనీ చెప్పుకొచ్చారు. ఆలయ అధికారులు- స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించడంలో ధనవంతులు, ఉన్నత వర్గాలకు చెందిన భక్తులకు అధిక ప్రాధాన్యతను ఇస్తోన్నారని రమణ దీక్షితులు ఆరోపించారు.
తమకు తాముగా వీఐపీలుగా చెప్పుకొంటోన్న వారికీ పెద్దపీట వేస్తోన్నారని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దైవ దర్శనాలను కలిగించే విషయంలో సామాన్య భక్తులకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లభించట్లేదని, ఈ పరిస్థితి మారాలని అన్నారు. కొద్దిసేపటి తరువాత రమణ దీక్షితులు ఈ ట్వీట్ ను డిలెట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.