బాబుని గెలిపించిందే.. కరుణకు షాకిచ్చింది: చెన్నైలో జయకు 'వరద'దెబ్బ
చెన్నై: తమిళనాడులో డీఎంకే పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ డీఎంకే కూటమి విజయం సాధిస్తుందని చెప్పాయి. కానీ కరుణానిధికి గట్టి షాక్ తగిలింది. ఈసారి నేనే ముఖ్యమంత్రిని అని కరుణానిధి భావించారు. కానీ 93 ఏళ్ల వయస్సులో మరోసారి ఆయన ఆశలు సఫలం కాలేదు.
కరుణానిధి గెలుస్తారని, అందుకు కొన్ని పలు కారణాలు చూపించారు. భారీ ఎత్తున ఉచిత పథకాలు, చెన్నై వరదల ప్రభావం తదితరాల వల్ల కరుణానిధి గెలుస్తారని భావించారు. కానీ అమ్మ పథకాల ముందు అవి వెలవెలపోయాయి.
అదే సమయంలో ఎన్నికల సమయంలో కరుణానిధి విసిరిన 'రుణమాఫీ' అస్త్రం ప్రధానంగా ఆయనను గద్దెనెక్కిస్తుందని చాలామంది భావించారు. కానీ అది రివర్స్ అయింది. ఏపీలో రుణమాఫీ పూర్తిగా సాధ్యం కాలేదు. దీంతో, ఈ ఎఫెక్ట్ కరుణానిధి పైన పడి ఉందని అంటున్నారు. రుణమాఫీని ఓటర్లు నమ్మి ఉండరని భావిస్తున్నారు.
ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికలలో రుణమాఫీ అస్త్రంతో గద్దెనెక్కారు. అదే అస్త్రాన్ని ఈసారి కరుణానిధి ప్రయోగించారు. కానీ కరుణానిధికి అది బెడిసికొట్టింది. అమ్మ పథకాల ముందు కరుణ రుణమాఫీ పథకం నీరుగారిపోయింది.
చెన్నైలో జయలలితకు ఎదురు దెబ్బ
తమిళనాడులో వరుసగా రెండోసారి విజయం సాధించి రికార్డ్ సృష్టించిన జయలలిత.. రాజధాని చెన్నై నగరంలో మాత్రం దెబ్బతిన్నారు. చెన్నై నగరంలో 16 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 11 స్థానాల్లో డీఎంకే విజయం సాధించింది. చెన్నై వరదల ఎఫెక్ట్ వల్లే ఇది అంటున్నారు. రాష్ట్రంలో జయలలిత సత్తా చాటగా.. చెన్నైలో మాత్రం దెబ్బతిన్నారు. వరదల సమయంలో సహాయ కార్యక్రమాలు తదితర వాటిల్లో జయ వైఫల్యం చెందారని భావిస్తున్నారు.