ఎయిర్ఏషియా స్కాం: 'అక్రమ మార్గంలో పనుల కోసం చంద్రబాబును కలిస్తే చాలు!'
Recommended Video
చిత్తూరు: ప్రపంచంలోనే అత్యంత దళారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం ఆరోపించారు. ఎయిర్ ఏషియా స్కాంతో మరోసారి ఈ విషం తెలిసిపోయిందన్నారు. నలభై ఏళ్ల తన రాజకీయ జీవితం మచ్చ లేదని చంద్రబాబుచెబుతుంటారని, కానీ ఎంతో అవినీతికి పాల్పడ్డారన్నారు.
ఎయిర్ఏషియా కేసు: 'చంద్రబాబును పట్టుకుంటే అంతే', చర్చనీయాంశంగా సంభాషణ
అక్రమ మార్గంలో చంద్రబాబును కలిస్తే పనులు
నాకు ఉంగరాలు లేవు, మద్యం తాగను, అమ్మాయిలతో తిరగలేదని చంద్రబాబు పదేపదే చెబుతూ స్కోత్కర్ష చేసుకుంటున్నారని భూమన మండిపడ్డారు. ఎయిర్ ఏషియా వంటి కుంభకోణం పచ్చ మీడియాకు కనిపించడం లేదా అన్నారు. అక్రమ మార్గంలో పనులు జరగాలంటే చంద్రబాబును కలిస్తే చాలన్నారు. ఎయిర్ ఏషియా స్కాంతో చంద్రబాబు ఏమిటో మళ్లీ తెలిసిందన్నారు.
బాబు అవినీతిపై ఎల్లో మీడియా మౌనం దేనికి?
చంద్రబాబు నాయుడు అవినీతి సామ్రాజ్యం ఏ స్థాయికి చేరిందో తెలుస్తోందని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. భారీ కుంభకోణం జరిగినా ఎల్లో మీడియా ఇప్పుడు మౌనంగా ఉందని మండిపడ్డారు. చంద్రబాబు పక్క రాష్ట్రాలకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి
మహిళలను అవమానపరిచేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు మాటలు తమకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు వందల హామీల్లో ఒక్కదానిని కూడా నెరవేర్చలేదన్నారు. పెట్రోల్ పైన రూ.4 వ్యాట్ పెంచి ప్రజల నడ్డి విరిచారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారని భూమన మండిపడ్డారు.
ఎయిర్ ఏషియా కేసు
కాగా, ఎయిర్ ఏషియా కేసుకు సంబంధించి తాజాగా వెలువడిన సంభాషణల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుల పేర్లు రావడం ఇప్పుడు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ విమానయానానికి కావాల్సిన పర్మిట్లను తెచ్చుకునేందుకు ఎయిర్ ఏషియా అడ్డదారులు తొక్కింది. పర్మిట్ల కోసం విమానయాన శాఖ ఉద్యోగులకు ఎయిర్ ఏషియా లంచాలు ఎర వేసింది. దాదాపు పది లక్షల డాలర్లను లంచాలను విమానయాన శాఖ అధికారులు స్వీకరించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అంచనా వేసింది. దీనిపై విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి సూచించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఇప్పటికే పలువురు పౌర విమానయాన శాఖ ఉద్యోగులను ఇప్పటికే అరెస్టు చేసింది. కాగా, అవినీతి కేసులో సీబీఐకి ఎయిర్ ఇండియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్, అతని వద్ద పని చేసే ఉద్యోగి మిత్తూ ఛాండిల్యాల మధ్య 30 నిమిషాల పాటు జరిగిన సంభాషణ ఆడియో టేపు సీబీఐ చేతికి చిక్కింది. ఈ మేరకు జాతీయ మీడియా ‘బిజినెస్ టుడే' ఓ కథనాన్ని ప్రచురించింది. ఇందులో చంద్రబాబు పేరు ఉంది.