హైద్రాబాద్ ఎవరి జాగీరుకాదు, రాజకీయమే: అక్బర్ స్పీచ్
విభజన వల్ల ముస్లింలకు కలిగే నష్టాల గురించి ఎవరు పట్టించుకోవడంలేదని, రాష్ట్రం విడిపోతే ముస్లింల రక్షణపై భరోసా ఉండదని అనుమానం వ్యకం చేశారు. రాష్ట్రంలోని ముస్లింలకు అన్ని విషయాల్లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల కోసమే రాష్ట్రంలోని పార్టీలు తెలంగాణ అంశాన్ని భుజానికెత్తుకున్నాయని ఆరోపించారు. తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని పలు సందర్భాల్లో చెప్పామన్నారు.
తెలంగాణ ఏర్పడితే సామరస్యం విఘాతం కలిగించేందుకు కొన్ని సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో మైనార్టీల రక్షణపై అనుమానాలున్నాయన్నారు. తెలంగాణలోని పది జిల్లాల్లో హిందుత్వ శక్తులు బలపడితే మైనార్టీలకు రక్షణ కరువవుతుందన్నారు. గత నాలుగేళ్లలో సంఘ్ పరివార్ సంస్థల ధర్నాలు, ఆందోళనలు ఇందుకు నిదర్శనమన్నారు. హైదరాబాదులో 42 శాతం, జిహెచ్ఎంసి పరిధిలో 33 శాతం ముస్లిం జనాభా ఉందన్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక మైనార్టీల రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. టిడిపి, బిజెపిలు సంయుక్తంగా బలపడతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం కానీ, బలహీనపడటం కాని జరుగుతుందన్నారు. భాషాప్రయుక్త కారణాల కన్నా రాజకీయ కారణాలే విభజనకు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. తెలంగాణ రాజకీయ నిర్ణయమని వ్యతిరేకిస్తున్నారని, రాజకీయ నిర్ణయాలు రాష్ట్రానికి కొత్తేం కాదన్నారు. తెలంగాణ నిర్ణయం రాజకీయమైతే హైదరాబాదు విలీనం కూడా అంతే అన్నారు.
విభజన ద్వారా రెండు రాష్ట్రాల్లో నష్టపోయేది ముస్లింలే అన్నారు. ప్రాంతీయ బోర్డులు నామమాత్రంగా మిగిలిపోయాయన్నారు. ముస్లింలు రాజకీయంగా ఎదగలేకపోయారన్నారు. మహారాష్ట్ర, కర్నాటకలో కలిసిన ప్రాంతాలు ఇప్పటికీ వెనుకబడే ఉన్నాయన్నారు. జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ సంయమనం పాటించి ఉంటే పోలీసు చర్య జరగపోయి ఉండేదన్నారు. విభజన నిర్ణయానికి తాము వ్యతిరేకం అయినప్పటికీ ఒప్పుకున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు ఉన్నా ఒక్క ఎంపీ లేరన్నారు. కొత్త రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికల్లో బిసిలకు రిజర్వేషన్లు కొనసాగించాలని, మైనార్టీ కమిషన్లు, ఇతర కమిషన్లు కొనసాగించాలన్నారు. కొత్త రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించాలని డిమాండ్ చేశారు. నాడు అధికార భాషగా ఉన్న ఉర్దూను తొలగించారన్నారు.
ఒప్పుకోం
హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేసేందుకు తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమన్నారు. ఉమ్మడి రాజధానిని కూడా వ్యతిరేకిస్తున్నామని, ఖైరతాబాద్ రెవెన్యూ డివిజన్ ప్రాంతాన్ని ఉమ్మడి రాజధానిగా చేయాలని, ఉమ్మడి గవర్నర్కు ఒప్పుకోమని అక్బరుద్దీన్ చెప్పారు. బిల్లు పెట్టినప్పుడే సీమాంధ్ర రాజధానిని ప్రకటించాలన్నారు. హైదరాబాద్ శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వానికే ఉండాలన్నారు. ఉమ్మడి హైకోర్టుకు అంగీకరించమని చెప్పారు. ఉగ్రవాదం దేశ భద్రతకే ప్రమాదకరంగా మారిందన్నారు.