ఉత్సవాలకు తిరుపతి ముస్తాబు
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 25 నుండి 29వ తేదీ వరకు తెప్పోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో డాక్టర్ శరత్ పరిశీలించారు. ఆలయ అధికారులతో కలిసి ఉత్సవ ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలను ఇచ్చారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో లక్షలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది.
ఈ నేపథ్యంలో వారికి కల్పించాల్సిన సౌకర్యాలు, వసతులపై జేఈవో ప్రత్యేకంగా పర్యటించారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భద్రత, పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు, దర్శన సౌకర్యాలు తదితర అంశాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. తెప్పోత్సవాల్లో వినియోగించే తెప్పల ఫిట్నెస్ను పూర్తిగా పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించాలని అన్నారు.

అలాగే విద్యుద్దీపాల కాంతులతో, పుష్పాల అలంకరణలతో తెప్పలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కచేరీలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జేఈవో తెలిపారు. అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పద్మావతి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని జేఈవో భక్తులను కోరారు.
ఈ నెల 25.. రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి తెప్పోత్సవం ఉంటుంది. అమ్మవార్లతో కలిసి కృష్ణస్వామివారు ఇక్కడి పుష్కరిణిలో తెప్పలపై ఊరేగుతారు. భక్తులను కటాక్షిస్తారు. 26న .. శ్రీ సుందరరాజస్వామివారి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. 27 నుంచి 29 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ఉంటాయి. గజవాహన, గరుడవాహన సేవలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. 28, 29 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు గజవాహన సేవ, గరుడవాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications