విమర్శల పైనా లింక్ : నాడు వైయస్ జగన్పై, నేడు శశికళ పైన?
వైసిపి అధఇనేత వైయస్ జగన్ పైన తెలుగుదేశం పార్టీ, ఇతర విపక్ష నాయకులు చేసే ఆరోపణలను, తాజాగా దివంగత జయలలిత విషయంలో శశికళ పైన వస్తున్న విమర్శలకు లింక్ పెడుతూ వార్తలు వస్తున్నాయి.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ, ఇతర విపక్ష నాయకులు చేసే ఆరోపణలను, తాజాగా దివంగత జయలలిత విషయంలో 'చిన్నమ్మ' శశికళ పైన వస్తున్న విమర్శలకు లింక్ పెడుతూ వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు ఇది ఆసక్తిని రేపుతోంది. అందులో వాస్తవం ఎంతో తెలియనప్పటికీ ఇరువురి పైన వచ్చిన ఆరోపణలను ఇప్పుడు పోల్చుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి చెందినప్పుడు జగన్ తాను ముఖ్యమంత్రి కావడానికి సంతకాలు పెట్టించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పుడు జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోను శశికళ తాను ముఖ్యమంత్రిని లేదా అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు కోసం నేతల నుంచి సంతకాలు తీసుకున్నట్లుగా తీవ్రంగా ప్రచారం సాగుతోంది.
జగన్ పైన ఆరోపణలు
వైయస్ రాజశేఖర రెడ్డి 2009లో మృతి చెందారు. ఆ సమయంలో వైయస్ శవం పక్కన ఉండగానే జగన్ తాను ముఖ్యమంత్రిని అయ్యేందుకు సంతకాలు పెట్టించారని తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికీ ఆరోపణలు గుప్పిస్తుంటారు. నాడు జగన్ సీఎంగా కావాలని నాటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులు సంతకాలు పెట్టారు.
జగన్కు సంబంధం లేదు
అయితే, ఈ సంతకాల సేకరణలో జగన్కు ప్రమేయం లేదనే వాదన ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇదే చెబుతారు. సంతకాలకు, జగన్కు సంబంధం లేదని చెబుతున్నారు. వైయస్ పైన అభిమానంతో.. జగన్ ముఖ్యమంత్రి కావాలని సంతకాలు చేపట్టారని అంటారు. కానీ జగన్ సంతకాల సేకరించారని టిడిపి నేతలు ధ్వజమెత్తుతుంటారు.
శశికళ సంతకాల సేకరణ
జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పటి నుంచే శశికళ చక్రం తిప్పారనే ప్రచారం సాగుతోంది. పార్టీ పగ్గాలు, అలాగే ముఖ్యమంత్రి పదవి కోసం ఆమె పావులు కదిపారనే ప్రచారం సాగుతోంది. తాను పార్టీ అధినేత్రిగా ఉండేందుకు నేతల నుంచి సంతకాల సేకరణ చేపట్టారనే విమర్శలు కూడా ఉన్నాయి.
తమిళనాట రాజకీయ వేడి
ఇప్పుడు తమిళనాడులోను అధికార అన్నాడీఎంకే పార్టీలో రాజకీయ వేడి రాజుకుంది. జయ మృతి నేపథ్యంలో పన్నీరు సెల్వం సీఎం అయ్యారు. అన్నాడీఎంకే పగ్గాలు శశికళకు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. సీఎం పన్నీరు సహా పలువురు నేతలు శశికళకు ఓటు వేస్తున్నారు.