IND vs ENG: ఇంగ్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్: చేజారిన నంబర్-1 ర్యాంక్!
IND vs ENG: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్లోని చివరి, ఐదో టీ20 మ్యాచ్ శనివారం (జూలై 11) జరిగింది. సౌతాంప్టన్లోని ది రోజ్ బౌల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 56 పరుగుల భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. 258 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. లక్ష్య ఛేదనలో భారత్ 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో ఇంగ్లండ్ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-0తో కైవసం చేసుకుంది. ఓ టీ20 సిరీస్లో భారత్ 4 మ్యాచ్లు ఓడిపోవడం ఇదే తొలిసారి.
టీమిండియా సిరీస్లో ఓడిపోవడమే కాకుండా, ఐసీసీ టీ20ఐ ర్యాంకింగ్స్లో నంబర్-1 స్థానాన్ని కూడా కోల్పోయింది. ఇప్పుడు ఇంగ్లాండ్ టీ20 ర్యాంకింగ్స్లో నంబర్-1 స్థానానికి చేరుకుంది. ఈ టీ20 సిరీస్లోని మొదటి మ్యాచ్ చెస్టర్-లె-స్ట్రీట్లో జరిగింది, కానీ వర్షం కారణంగా అది రద్దయింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ2లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాటింగ్హామ్లో జరిగిన మూడో మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో గెలిచింది. ఆ తర్వాత బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో కూడా ఆతిథ్య జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు సౌతాంప్టన్లో కూడా ఇంగ్లాండ్ జట్టు శ్రేయస్ అయ్యర్ సేనను ఓడించింది.

దంచికొట్టిన ఇంగ్లాండ్ బ్యాటర్లు
ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు టీమిండియా బౌలింగ్ లో చితకబాదారు. ముందుగానే ఫిల్ సాల్ట్ ఆరు పరుగులు మాత్రమే చేసి ప్రసిద్ధ్ కృష్ణ ఔటయ్యాడు. అనంతరం జోస్ బట్లర్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ వీరవిహారం చేశారు. ఇద్దరు కలిసి డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జోస్ బట్లర్ కేవలం 51 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేశాడు.బట్లర్, బ్రూక్ రెండో వికెట్కు 102 బంతుల్లో 233 పరుగులు జోడించి టీమిండియాను నిస్సహాయ స్థితిలో పడేశారు. బట్లర్ 64 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 131 పరుగులు చేశాడు. ఇది బట్లర్ టీ20 అంతర్జాతీయ కెరీర్లో రెండో సెంచరీ. 19వ ఓవర్లో శివమ్ దూబే బౌలింగ్లో బట్లర్ ఔటయ్యాడు. ఆ తర్వాతి బంతికే శివమ్.. జాకబ్ బెథెల్ను (0 పరుగులు) కూడా ఔట్ చేశాడు. సెంచరీ పూర్తి చేయలేకపోయిన హ్యారీ బ్రూక్ అజేయంగా 95 పరుగులు చేశాడు. బ్రూక్ తన ఇన్నింగ్స్లో 8 సిక్సర్లు, 4 ఫోర్లు కొట్టాడు.
భారత బ్యాటింగ్ విఫలం
అనంతరం 258 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్ కు పేలవమైన ఆరంభం లభించింది. అభిషేక్ శర్మ కేవలం 3 పరుగులకే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఔటయ్యాడు. సంజు సామ్సన్ (27) కొన్ని మంచి షాట్లు ఆడినప్పటికీ.. సామ్ కరన్ వేసిన మొదటి బంతికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సంజు శాంసన్ ఔటయ్యే సమయానికి భారత్ స్కోరు 55/2. అక్కడి నుంచి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (28 పరుగులు), ఇషాన్ కిషన్ మూడో వికెట్ కు 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లియామ్ డాసన్ తన స్పిన్తో శ్రేయస్ ను పెవిలియన్ కు పంపాడు. ఇషాన్ కిషన్ కూడా అర్ధ సెంచరీ చేసిన తర్వాత ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక ఆదిల్ రషీద్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇషాన్ 35 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ ఔటైన తర్వాత, మ్యాచ్లో భారత జట్టు పట్టు కోల్పోయింది. తిలక్ వర్మ 25 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 53 పరుగులు సాధించాడు. శివమ్ దూబే (14 పరుగులు), సూర్యాంశ్ షెడ్గే (7 పరుగులు), అక్షర్ పటేల్ (3 పరుగులు) బ్యాటింగ్లో నిరాశపరిచారు. ఇంగ్లండ్ తరఫున సామ్ కరన్ మూడు వికెట్లతో అత్యధికంగా రాణించగా, ఆదిల్ రషీద్ రెండు వికెట్లు పడగొట్టాడు.












Click it and Unblock the Notifications