సిపిఐ, కాంగ్రెసు పొత్తు ఖరారు: సీట్లపై బేరాలు
హైదరాబాద్: సిపిఐ, కాంగ్రెసు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖరారైంది. సిపిఐకి ఒక లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి తెలంగాణ కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. శాసనసభ స్థానాల విషయంలో స్పష్టత రాగానే పొత్తుపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. మంగళవారం కాంగ్రెస్ పెద్దలతో పొత్తు విషయమై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయన జరిపిన చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది.
శాసనసభా స్థానాల విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని తెలుస్తోంది. దీనిపై మరొకసారి చర్చలు జరిపిన అనంతరం పొత్తుపై అధికారిక ప్రకటన చేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. ఈ విషయమై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధిష్టానం పిలుపు మేరకు మంగళవారం ఢిల్లీ వెళ్ళారు. బుధవారం దిగ్విజయ్ సింగ్తో చర్చలు జరిపిన తర్వాత సిపిఐతో పొత్తును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

17 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలను సిపిఐ కోరింది. అయితే సిపిఐకి ఉన్న నాలుగు సిట్టింగ్ స్థానాలతో పాటు మరో నాలుగు స్థానాలను ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. కానీ 12 స్థానాలు కావాలని సిపిఐ పట్టుపట్టగా, మధ్యేమార్గంగా 10 స్థానాలకు రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. బెల్లంపల్లి, మునుగోడు, దేవరకొండ, కొత్తగూడెం, వైరా, పినపాక, హుస్నాబాద్, మహబూబాబాద్, వర్దనపేట, నర్సాపూర్, ఇబ్రహీంపట్నం స్థానాలను సిపిఐ కోరింది.
ఈ స్థానాల్లో కాంగ్రెస్ సిట్టింగ్ శాసనసభ్యులు ఉండడంతో, అధిష్టానం అనుమతి తీసుకున్న తర్వాతే సిపిఐకి అధికారికంగా హామీ ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందుకే బుధవారం ప్రయాణం కానున్న పొన్నాల మంగళవారమే ఢిల్లీకి బయలుదేరారు. పొత్తులు, అభ్యర్థుల విషయమై తుది కసరత్తు కోసం పొన్నాలతో పాటూ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలను ఢిల్లీ రావాలని దిగ్విజయ్సింగ్ ఆదేశించారు.












Click it and Unblock the Notifications