రైతులను వారి భూముల్లోకి వెళ్లనివ్వండి: హైకోర్టు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూసమీకరణ పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈలోగా రైతుల కార్యకలాపాలకు ఎలాంటి భంగం కలిగించొద్దని సిఆర్డిఏ, ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
ఏపి రాజధాని కోసం బలవంతపు భూసమీకరణను వ్యతిరేకిస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్ను రాష్ట్ర హైకోర్టు విచారణకు స్వీకరించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తమ భూముల్లోకి వెళ్లేందుకు రైతులకు అవాంతరాలు సృష్టించొద్దని స్పష్టం చేసింది.
తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. రైతుల తరపున హైకోర్టు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. కాగా, మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేస్తామని ఏపి ప్రభుత్వ అడ్వోకేట్ తెలిపారు.
ల్యాండ్ పూలింగ్ నుంచి తమను తప్పించాలని కోరుతూ ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాలకు చెందిన 32 మంది రైతులు కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. సిఆర్డిఎ చట్టంలోని క్లాజ్ 22 సెక్షన్ 2(52) ప్రకారం స్వచ్ఛందంగా భూములు ఇస్తేనే తీసుకోవాలని, బలవంతంగా భూములు లాక్కునే పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని రైతులు తమ పిటిషన్లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్కు తాము వ్యతిరేకమంటూ ఇప్పటికే సిఆర్డిఎకు అభ్యంతర ఫారాలు రైతులు ఇచ్చారు. ఆ అభ్యంతర ఫారాలు ఇచ్చిన 15 రోజుల తర్వాత ప్రభుత్వం నుంచి సమాధానం రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. అభ్యంతర ఫారాలు ఇచ్చిన రైతులకు ల్యాండ్ పూలింగ్తో సంబంధం లేదంటూ సిఆర్డిఎ నిబంధనల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది వరకే పేర్కొంది. అయితే, అభ్యంతర ఫారాలు ఇచ్చిన నెల గడుస్తున్నా ప్రభుత్వం నుంచి సమాధానం లేకపోవడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు.