రాజకీయ చదరంగంలో పావుగా మారిన ''అమరావతి''?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాజకీయ చదరంగంలో పావుగా మారింది. భారతీయ జనతాపార్టీ కి ఇప్పుడు హఠాత్తుగా రాజధానిపై ప్రేమ పుట్టుకు రావడానికి కారణం ఏంటి? తన మిత్రపక్షం జనసేనను కలుపుకోకుండా ఒంటరిగా పాదయాత్రకు శ్రీకారం చుట్టాల్సిన ఆవశ్యకత ఏమిటి? దేశంలో ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులేవీ ఆలస్యమవలేదు.. అమరావతి ఎందుకు ఆలస్యమవుతోంది? పెనుమాకలో రైతు అడిగిన ప్రశ్నకు జవాబు ఎందుకు చెప్పలేకపోయారు? ఇదీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను తొలిచేస్తున్న ప్రశ్నలు. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఏపీ బీజేపీ నేతలపైనే ఉంది.

టీడీపీ, జనసేనకన్నా బీజేపీపైనే నమ్మకం పెట్టుకున్నారు
అమరావతి నిర్మాణానికి సంబంధించి రాష్ట్రంలోని పార్టీలకన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైనే మహత్తర బాధ్యత ఉంది. ఇక్కడి రైతులు కూడా తెలుగుదేశం, జనసేన కన్నా ఆ పార్టీపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. రాజధానిని వికేంద్రీకరించాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ కూడా వ్యతిరేకించింది. అమరావతి పరిధిలోని 29 గ్రామాలకు చెందిన ప్రజలంతా బీజేపీపైనే ఎక్కువ భరోసా కనపరిచారు. అమరావతిని ఏకైక రాజధానిగా నడిపించగల శక్తి ఒక్క నరేంద్రమోడీ, అమిత్ షాకే ఉందని భావించారు. అందుకు తగ్గ నమ్మకాన్ని అమరావతి రైతుల్లో స్థానిక బీజేపీ నేతలు కల్పించలేకపోయారు.

మహా పాదయాత్రతోనే బీజేపీలో కదలిక
రాజధానిగా అమరావతి పరిరక్షణ ఆవశ్యకత ను గుర్తించిన అప్పటి బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర కమిటీలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఉద్యమానికి పార్టీ తరఫున ప్రత్యక్షంగా మద్దతు పలికారు. ఆ తర్వాత సోము వీర్రాజు అధ్యక్షుడయ్యారు. అనంతర పరిణామాల్లో అమరావతిపై బీజేపీ నాయకులు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. చేస్తున్నారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతులు, మహిళలు జరిపిన మహా పాదయాత్ర వరకు స్థానిక బీజేపీ నేతలెవరూ స్పందించలేదు. అమిత్ షా జోక్యం చేసుకొని రాష్ట్ర నాయకులకు తలంటిపోసిన తర్వాతే కొందరు నాయకులు అయిష్టంగానే అమరావతికి జైకొట్టారు.

రైతుల ప్రశ్నలకు సమాధానమేదీ?
బీజేపీ అండ చూసుకొనే రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని చంపేసిందని, వైసీపీ, బీజేపీ.. ఇద్దరూ తోడుదొంగలంటూ పెనుమాక రైతు అడిగిన ప్రశ్నలకు సోము వీర్రాజు సమాధానం చెప్పలేకపోయారు. అధికారం ఇస్తే ఏడాదిలో అమరావతిని పూర్తిచేస్తానన్నారు. అధికారం చేపట్టగల సామర్థ్యం బీజేపీకి ఏపీలో ఉందా? అంటే లేదు అని రాజకీయాలపై అవగాహన ఉన్నవారు చెబుతారు. కానీ రాజధాని నిర్మాణాన్ని అధికారంతో ముడిపెట్టాలనుకోవడం ఎంతవరకు సబబు అనే ప్రశ్నలు వస్తున్నాయి. చిత్తశుద్ధి ఉంటే అధికారం లేకపోయినా రాజధాని నిర్మాణం కొనసాగించేలా చేయవచ్చని రైతులు చెబుతున్నారు. నాలుగోతేదీన పాదయాత్ర ముగియబోతోంది. అప్పట్లోగా ఢిల్లీ పెద్దలచేత ఒక స్పష్టమైన ప్రకటనైనా చేయించాలని రాజధాని రైతులు కోరుతున్నారు. వారి విజ్ఞప్తిని పార్టీ నేతలు సానుకూలంగా తీసుకుంటారా? లేదా? అనేదానిపై స్పష్టత రావాలంటే మరో మూడురోజులు వేచిచూస్తే సరిపోతుంది.












Click it and Unblock the Notifications