రంగా హత్య కేసులో బాబే: సునీతకు అంబటి రిప్లై
వంగవీటి రంగా హత్య కేసును తిరగదోడితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటి ముద్దాయి, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావు రెండో ముద్దాయి అవుతారని ఆయన ఆరోపించారు. వంగవీటి హత్య కేసులో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కోడెల శివప్రసాదరావులపై ఆరోపణలు వచ్చాయని ఆయన అన్నారు. ఇలాంటి రాజకీయ ఆరోపణలు రుజువు కాకపోవడం వల్లనే వారు పదవుల్లో ఉన్నారని ఆయన అన్నారు.
పరిటాల రవి హత్య కేసు తిరుగదోడుతామని చెబుతున్న టిడిపి నాయకులు వంగవీటి రంగా హత్య కేసుపై మళ్లీ విచారణకు సిద్ధపడుతారా అని అంబటి రాంబాబు అడిగారు. వంగవీటి హత్యతో పాటు టిడిపి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఇతర రాజకీయ హత్యలకు సంబంధించిన కేసులను తిరగదోడేందుకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీ అసంబద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారని, స్థానిక ప్రజా ప్రతినిధుల ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. శాసనసభలో తమ పార్టీ శాంతిభద్రతల గురించి మాట్లాడితే పరిటాల రవి హత్య గురించి ప్రస్తావించడం సరికాదని ఆయన అన్నారు.