టీటీడీ చేసిన ఆ తీర్మానం వెనుక భారీ అవినీతి కుట్ర.. దానికోసం లోకేష్ ఒత్తిడి!
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో 134వ తీర్మానం అవినీతికి కేరాఫ్ అని టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుమల తిరుపది దేవస్థానం జూలై 14న జరిగిన పాలక మండలి సమావేశంలో దుర్మార్గమైన నిర్మయం తీసుకుందన్నారు. 134వ తీర్మానంతో టీటీడీ పరిధిలోని బర్డ్స్, స్విమ్స్ , పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి మందులు, ఇంజెక్షన్లు, పరికరాల కొనుగోళ్లలో కుంభకోణానికి తెర లేపారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు
టీటీడీ ఆ తీర్మానం వెనుక భారీ కుట్ర: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
టీటీడీ పాలక మండలి చేసిన ఆ తీర్మానం వెనుక భారీ అవినీతి కుట్ర ఉందన్నారు. రోగుల ప్రాణ రక్షక మందులు, ఇంజక్షన్ లు, పరికరాల కొనుగోలు నిబంధనలను సడలించి అవినీతికి అస్కారం కలిగేలా చేశారన్నారు. మందులు, పరికరాలు సరఫరా చేసే సంస్థకు రూ.100 కోట్ల టర్నోవర్ అర్హతను రూ.25 కోట్లకు తగ్గించడం దారుణం అని టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.

టీటీడీ నిర్ణయం వెనుక లోకేష్ ఒత్తిడి
టీటీడీ ఆసుపత్రుల్లో నాసిరకం మందులకు తలుపులు తెరిచి రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన అన్నారు. కమిషన్ల కోసమే మందులు, పరికరాల సరఫరా చేసే సంస్థల టర్నోవర్ తగ్గించి టెండర్లను పిలిచినట్టు పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలపై కూటమి ప్రభుత్వం కమీషన్ల రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. టీటీడీ పాలక మండలి నిర్ణయం వెనుక నారా లోకేష్ ఒత్తిడి ఉందని భూమన కరుణాకర్ రెడ్డి అభిప్రాయ పడ్డారు.
అజ్ఞాత కమిటీ పేరుతో అజ్జాన నిర్ణయం
తనకు అనకూలంగా ఉన్నవారికి టెండర్ కట్టబెట్టి కమీషన్లు రాబట్టేందుకు లోకేశ్ స్కెచ్ వేశారన్నారు. అజ్ఞాత కమిటీ పేరుతో అజ్జాన నిర్ణయం తీసుకుని అవినీతికి పాల్పడుతున్నారు అని మండిపడ్డారు. టిటిడి ఆస్పత్రులలో మందుల, పరికరాల నాణ్యతను కాపాడాల్సింది పోయి నిబంధనలనే బలహీనపరిచారన్నారు. టీటీడీ బోర్డులో కీలకమైన సభ్యురాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినా సరే లోకేశ్ తన అవినీతి కోసం ఖాతరు చేయలేదని ఆయన అభిప్రాయపడ్డారు .
టీటీడీ ఆసుపత్రుల టెండర్లలో గోల్ మాల్ జరుగుతుందన్న భూమన
ఆసుపత్రులలో మందులు, ఇంజక్షన్ల కొనుగోళ్లలో పారదర్శకతను ప్రభుత్వం ధ్వంసం చేసిందన్నారు. ఆరోగ్యశ్రీని బలహీనపరిచిన ప్రభుత్వం ఇప్పుడు టీటీడీ వైద్య సేవలపై దాడి చేస్తుందని విమర్శించారు. టీటీడీ ఆసుపత్రుల టెండర్లలో గోల్ మాల్ జరుగుతోందని, ఎల్-1 టెండర్ల పేరుతో భారీ అవినీతి జరుగుతోందని ఆయన ఆరోపించారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి టీటీడీకి అధిక ధరలకు విక్రయిస్తున్నారని మండిపడ్డారు.
134వ తీర్మానంపై స్వతంత్ర న్యాయ విచారణ జరపాలని డిమాండ్
టీటీడీని కూడా అవినీతి కేంద్రంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. 134వ తీర్మానంపై స్వతంత్ర న్యాయ విచారణ జరపాలని వైఎస్సార్సీపీ తరపున డిమాండ్ చేస్తున్నట్టు భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు . ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా నిబంధనలు సడలించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.













Click it and Unblock the Notifications