ఎంపీ రఘురామ బాటలో ఎమ్మెల్యే ఆనం?.. వైసీపీలో సెల్ఫీ కలకలం.. సింహపురి ఎక్స్ప్రెస్ కొత్త ఎత్తులు..
ఒక సెల్ఫీ.. వంద ప్రశ్నలు.. ఎందుకు కలిశారు? ఏం మాట్లాడుకున్నారు? ఏం జరగబోతోంది? అంటూ ఎడతెరిపిలేని విశ్లేషణలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా కొనసాగుతోన్న ఎంపీ రఘురామకృష్ణంరాజు.. వైసీపీకే చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డితో దిగిన సెల్ఫీ కలకలం రేపుతున్నది. ఇద్దరూ తిరుగుబాటుదారులే కావడంతో వైసీపీలోనూ దీనిపై చర్చ నడుస్తున్నట్లు వినికిడి.

చాలా కాలంగా సైలెంట్..
‘‘గెలిచి ఏడాది పూర్తయినా నా నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయా. పదవులు నాకు అలంకారప్రాయం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలకు మంత్రిగా పని చేశాను. కానీ ఇప్పుడు పరిస్థితి దారుణంగా తయారైంది. నేను ప్రాతినిధ్య వహిస్తోన్న ‘వెంకటగిరి' అనే నియోజకవర్గం ఒకటున్నట్లు జిల్లా అధికారులు మర్చిపోయినట్లున్నారు..'' అంటూ నెల రోజుల కిందట సంచలన వ్యాఖ్యలు చేసిన ఆనం రామనారాయణ రెడ్డి.. తర్వాతి కాలంలో సైలెంట్ అయిపోయారు. అలాంటిది, సడెన్ గా రఘురామతో ఆయన దిగిన సెల్ఫీ వైరల్ గా మారడంతో ఆనం వ్యవహారం మళ్లీ చర్చనీయాంశమైంది. నిజానికి ఆయన సైలెంట్ గా కూర్చోలేదని, కొత్త వ్యూహాలను సిద్ధం చేశారని ఆనం వర్గీయులు చెబుతున్నారు.

నర్సాపూర్ - సింహపురి ఎక్స్ప్రెస్..
పార్టీ విధానాలు, నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళుతున్నారంటూ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన వైసీపీ.. ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా కోరింది. దీనిపై స్పీకర్ నిర్ణయం పెండింగ్ లో ఉండగానే.. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఒక్కొక్కరుగా రఘురామపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. కేసుల తీవ్రత దృష్ట్యా అరెస్టు తప్పదని వార్తలు రావడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ నేతల ఫిర్యాదులపై పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ రఘురామ దాఖలు చేసిన రెండు స్క్వాష్ పిటిషన్లు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈలోపే ఆనంతో ఆయన సెల్ఫీ బయటికి రావడంతో ‘‘నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ తో సింహపురి ఎక్స్ ప్రెస్ జతకలిసింది..''అంటూ ప్రచారం మొదలైంది.

ఆనంపైనా అదే లేటు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఏడాదికిపైగా పూర్తిగా పరిపాలనకే అంకితం కావడంతో పార్టీ పరంగా చాలా జిల్లాల్లో లుకలుకలు, అసంతృప్తులు పొడచూపాయి. నెల్లూరు జిల్లాలో ఆనం రామనాయారణరెడ్డి వర్గం.. మంత్రి అనిల్ కుమార్, మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గాలకు మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లడం, ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధికారులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఆనంపై చర్యలుగానీ, సీఎం నుంచి పిలుపుగానీ లేకపోవడం గమనార్హం. సొంతపార్టీపై గుర్రుగా ఉన్న ఆయన.. రఘురామతో కలయిక ద్వారా బీజేపీకి దగ్గరవుతోన్నట్లు సంకేతాలిచ్చారా? అనే కోణంలోనూ చర్చ జరుగుతున్నది. సొంత పార్టీపై విమర్శలు చేసిన తర్వాత రఘురామపై చర్యలకు వైసీపీ చాలా సమయం ఓపికవహించింది. ఆనం విషయంలో ఏం జరగబోతోందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

ఒక్కతాటిపైకి ఆనం సోదరులు?
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తమదైన ప్రభావం చూపుతూ వచ్చిన ఆనం కుటుంబంలో మొత్తం నలుగురు సోదరులున్నారు. వారిలో వివేకానంద రెడ్డి మరణించగా, రామనారాయణరెడ్డి, విజయకుమార్ రెడ్డి వైసీపీలో ఉన్నారు. మరో సోదరుడు జయకుమార్ రెడ్డి టీడీపీలో కొనసాగుతున్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం, ఒకే పార్టీలో ఉన్నా సోదరుడు విజయకుమార్ విభేదాలు తలెత్తడం లాంటి పరిణామాలతో రామనాయారణ రెడ్డి మెల్లగా ప్రభావాన్ని కోల్పోయే పరిస్థితి తలెత్తిందని, అందుకే ఆయన తెగించి మరీ సర్కారుపై వ్యాఖ్యలు చేశారని, జిల్లాలో ఫ్యామిలీ పట్టు తిరిగి నిలిచేలా సోదరులతోనూ సఖ్యతకు ప్రయత్నాలు చేస్తున్నారని స్థానిక నేతలు అంటున్నారు. ఒకవేళ రఘురామ బాటలో నడవాలనుకుంటే ఆనం తన సోదరులను కూడా వెంటపెట్టుకెళతారనే ప్రచారం జిల్లాలో సాగుతున్నది.
Recommended Video

సీఎం జగన్కు వరుస సవాళ్లు..
ఏడాదిగా పరిపాలనలో బిజీ అయిపోయిన సీఎం జగన్.. అతి త్వరలోనే పార్టీపై దృష్టిపెడతానని, రోజుకు కనీసం 10 మంది నేతలనైనా కలుస్తానని చెప్పి రోజులు గడుస్తున్నా ఆ దిశగా కలాపాలు సాగడంలేదు. ఇప్పటికే బలంగా ఉన్న పార్టీని అజేయశక్తిగా మార్చే క్రమంలో సీఎం జగనే అందరితో ఇంటరాక్ట్ అవుతారని భావించినా.. పార్టీలోని ముగ్గురు (విజయసాయిరెడ్డి, వైసీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి)లకు జిల్లాల వారీగా సమీక్ష బాధ్యతను కట్టబెట్టారు. జగన్ జోక్యం ఆలస్యం అవుతోన్న కొద్దీ ఒక్కో జిల్లాలో సీనియర్లు సైతం గళం విప్పుతూ సవాళ్లు విసురుతున్నారు. రఘురామపై వేటుకు ఆదేశించిన సీఎ జగన్.. మిగతా అసంతృప్తి నేతలపై ఎలా వ్యవహరిస్తారనేది ఉత్కంఠరేపుతున్నది.












Click it and Unblock the Notifications