వైఎస్ జగన్పై సుప్రీంకోర్టు సుమోటో కేసు- ఏపీ హైకోర్టు లాయర్ లెటర్..!!
విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించబోతోన్నామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వేదికగా ప్రకటించడాన్ని ఏపీ హైకోర్టు న్యాయవాది తప్పుపట్టారు. ఆయనపై సుమోటో కేసు నమోదు చేయాలంటూ సుప్రీంకోర్టుకు లేఖ రాశారు.
విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు వ్యవహారంపై స్పష్టత ఏర్పడింది. సాగరనగరం విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించబోతోన్నామని, తాను కూడా అక్కడికే తరలి వెళ్లబోతోన్నానంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఢిల్లీ పర్యటన సందర్భంగా చేసిన ప్రకటన- ఆయన ఉద్దేశాన్ని వెల్లడించింది. విశాఖపట్నానికి రాజధానిని తరలించడంపై ఇదివరకెప్పుడూ జగన్ తొలిసారిగా మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏప్రిల్ లోగా రాజధాని అమరావతి నుంచి సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేశారు. అక్కడ ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను పరిపాలన కోసం వినియోగించుకోనుంది ప్రభుత్వం. భీమిలి రోడ్డులో ఖాళీగా ఉన్న భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయనుంది. ఖాళీగా ఉన్న వుడా భవనాలను కూడా గుర్తించింది. భీమిలి రోడ్డులోని భవనాలనే సెక్రటేరియట్ గా వాడుకోనుంది.
వైజాగ్ వెళ్తున్నా.. పెట్టుబడులు పెట్టేందుకు రండి-విదేశీ ఇన్వెస్టర్లకు వైఎస్ జగన్ పిలుపు..!!#YSJagan #VizagCapital #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/ektZTMl7dr
— oneindiatelugu (@oneindiatelugu) January 31, 2023
ఇదిలావుండగా- విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించబోతోన్నామంటూ వైఎస్ జగన్ చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్లు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రకటన చేయడం కోర్టు ధిక్కారణ కిందకి వస్తుందని ఏపీ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ చెప్పారు. జగన్ పై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కు లేఖ రాశారు. జనవరి 31వ తేదీన ఢిల్లీలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో వైఎస్ జగన్ చేసిన ప్రకటన కోర్టు ధిక్కార చట్టం పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. రాజధాని అంశంపై అమరావతి ప్రాంత రైతులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను ఇదివరకు ఏపీ హైకోర్టు విచారించిందని, దీనిపై ఓ స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.
ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ దశలో ఉన్న ఈ అంశంలో ప్రతివాదిగా ఉన్న వైఎస్ జగన్- విశాఖపట్నానికి రాజధానిని తరలించబోతోన్నామని, తాను కూడా అక్కడికే వెళ్తానంటూ ప్రకటన చేయడం సరికాదని అన్నారు. ఇది కోర్టు ధిక్కారణ చట్టం, సెక్షన్ 2 (సీ)ని ఉల్లంఘించినట్టవుతుందని గూడపాటి లక్ష్మీనారాయణ అన్నారు. దీన్ని సుమోటోగా స్వీకరించాలని, జగన్ పై కేసు నమోదు చేయాలని ఆయన సీజేఐకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.