శ్రీశైలంలో తీవ్రమైన హిందూ, ముస్లిం దుకాణాల రచ్చ: అప్రమత్తమైన ప్రభుత్వం: ఈఓ బదిలీ..వేలం రద్దు!

కర్నూలు: శ్రీశైలంలోని ప్రఖ్యాత శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానానికి సంబంధించిన దుకాణాల రద్దు వ్యవహారం మరో మలుపు తీసుకుంది. పవిత్రమైన శ్రీశైలం ఆలయానికి సంబంధించిన దుకాణ సముదాయాలను ముస్లిం వర్గాలకు కేటాయించినట్లు ఘాటు ఆరోపణలు వెల్లువెత్తడం, ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని హిందూ సంఘాలు ఆందోళనలను చేపట్టడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముస్లింలకు దుకాణాలను కేటాయించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏ శ్రీరామచంద్ర మూర్తిపై బదిలీ వేటు వేసింది. అప్పటికప్పుడు ఆయనను విధుల నుంచి తప్పించింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. శ్రీశైలం ఆలయం కార్యనిర్వహణాధికారిగా కేఎస్‌ రామారావును నియమించింది. ప్రస్తుతం కేఎస్ రామారావు రంపచోడవరంలో స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.

వివాదానికి అక్కడే బీజం..

వివాదానికి అక్కడే బీజం..

శ్రీశైలం దేవస్థానం సమీపంలో కొత్తగా దుకాణ భవన సముదాయాన్ని నిర్మించారు. శ్రీలలితాంబికా అమ్మవారి పేరుతో ఈ సముదాయన్ని నిర్మించారు. ఈ భవనంలో ఒకేసారి 300లకు పైగా దుకాణాలను ఏర్పాటు చేసుకునే వీలు ఉంది. ఇందులో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న 182 దుకాణాలను నిర్వాహకులకు కేటాయించడానికి కొద్దిరోజుల కిందటే శ్రీశైలం ఆలయ అధికారులు వేలంపాటలను నిర్వహించారు. ఈ వేలంపాటలను ఈఓ శ్రీరామచంద్రమూర్తి పర్యవేక్షించారు. మొత్తం దుకాణాల్లో 182 షాపులను ముస్లింలకు కేటాయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వేలం పాటల సందర్భంగా హిందువులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. ఈఓ శ్రీరామచంద్రమూర్తి వాటిని పట్టించుకోలేదనే విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారం కాస్త రాజకీయ రంగును పులుముకొంది. దుకాణాల కోసం టెండర్లు వేయడానికి వచ్చిన ముస్లింలపై బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్‌ రెడ్డి, ఆయన అనుచరులు దాడికి సైతం దిగారు.

ఈఓ వాదన ఏంటీ..?

ఈఓ వాదన ఏంటీ..?

శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబికా మల్లికార్జునస్వామి దేవస్థానంలో హైకోర్టు ఉత్తర్వులు మేరకే దుకాణాల వేలంపాటలను నిర్వహించామని ఆలయ శ్రీరామచంద్రమూర్తి చెప్పుకొచ్చారు. దుకాణాల కోసం నిర్వహించిన వేలం పాటల్లో అన్యమతస్తులకు అవకాశం కల్పించలేదని వివరణ ఇచ్చుకున్నారు. తాము చట్ట ప్రకారం మాత్రమే టెండర్ దరఖాస్తులను స్వీకరించినట్లు చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు టెండర్ల ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా చేపట్టామని అన్నారు. అయినప్పటికీ- ఆయనపై చెలరేగిన ఆరోపణల దుమారం తగ్గలేదు. ముస్లింలతో కుమ్మక్కయ్యారని, వారి నుంచి పెద్ద మొత్తంలో లంచాలను తీసుకున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు.
తలుపులు మూసి మరీ టెండర్లను నిర్వహించారని విమర్శించారు.

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఆందోళన బాట..

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఆందోళన బాట..

ఈ వ్యవహారంపై గోషామహల్ కు చెందిన భారతీయ జనతాపార్టీ శాసన సభ్యుడు రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ దేవాదాయశాఖ అధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన `ఛలో శ్రీశైలం` పేరుతో ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి హిందూవాదులంతా పెద్దఎత్తున తరలి రావాలని కోరుతూ ట్విట్టర్ ద్వారా కోరారు. శ్రీశైలంలో భక్తుల సంఖ్య భారీ ఎత్తున ఉన్న నేపథ్యంలో..ఇలాంటి ఉద్యమాల వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంటుందని పోలీసులు భావించారు. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టారు. శ్రీశైలంలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరింపజేశారు. ముందస్తు అనుమతి లేనిదే బహిరంగంగా ధర్నాలు..ర్యాలీలు, నిరసనలు నిర్వహించకూడదని డీఎస్పీ వెంకట్రావు అప్పటికప్పుడు ఆదేశాలను జారీ చేశారు.

ప్రభుత్వం.. అప్రమత్తం

ప్రభుత్వం.. అప్రమత్తం

మంగళవారం ఉదయం ఎమ్మెల్యే రాజాసింగ్ ఛలో శ్రీశైలం ఉద్యమాన్ని నిర్వహించాల్సి ఉండగా..ప్రభుత్వం అప్రమత్తమైంది. సోమవారం రాత్రి కీలక ఉత్తర్వులను జారీ చేసింది. శ్రీరామచంద్రమూర్తిపై బదిలీ వేటు వేసింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. శ్రీలలితాంబికా అమ్మవారి భవన సముదాయంలో 182 దుకాణాల కోసం నిర్వహించిన వేలంపాటలను రద్దు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సైతం అప్పటికప్పుడే వెలువడ్డాయి. దేవాలయాల కార్యకలాపాల్లో రాజకీయాలకు తావులేదని, శ్రీశైల దేవస్థానం పరిరక్షణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన స్పష్టం చేశారు. గిరిజనులు, చెంచుల ఆర్థిక స్వావలంబన కోసం ఉద్దేశించిన దుకాణాలను వారికి మాత్రమే కేటాయిస్తామని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+