అప్పుల కోసం ఆర్బీఐ వద్దకు ఏపీ ప్రభుత్వం
Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రుణాలపై ఎక్కువగా ఆధారపడింది.
అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడానికి అవసరమైన నిధులను కూడగట్టుకునే ప్రయత్నాల్లో పడింది. ఇందులో భాగంగా- ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లు/స్టాక్స్ను వేలానికి పెట్టే సంప్రదాయాన్ని అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కొనసాగిస్తోంది.

ఇప్పటికే దశలవారీగా వేల కోట్ల రూపాయల విలువ చేసే సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అప్పులకు వెళ్లింది చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం. తాజాగా 5,000 కోట్ల రూపాయలను సమీకరించుకోనుంది. దీనికి అవసరమైన రెండు స్టాక్స్ను రిజర్వ్ బ్యాంక్ వద్ద వేలానికి పెట్టింది.
ఇందులో రెండు 1,500 కోట్ల రూపాయల చొప్పున విలువ చేసేవి.. మరో సెక్యూరిటీ విలువ- 2,000 కోట్ల రూపాయలు. ఈ నెల 5వ తేదీన అంటే మంగళవారం నాడు ఈ స్టాక్స్ ఆర్బీఐ వద్దకు వేలానికి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఇ-కుబేర్) ద్వారా వేలం పాట సాగుతుంది. కాంపిటీటివ్, నాన్ కాంపిటీటివ్ బిడ్స్ రూపంలో వాటిని విక్రయిస్తుంది.
ఈ స్టాక్స్ కాల వ్యవధి ఒకటి- 6, మరొకటి- 9, ఇంకొకటి- 9 సంవత్సరాలు. వ్యక్తులు లేదా సంస్థలు వీటిని కొనుగోలు చేయవచ్చు. కాంపిటీటివ్ విధానంలో ఈ మూడు స్టాక్స్ను కొనదలిచిన వారు మంగళవారం ఉదయం 10:30 నుంచి 11:30 గంటలు, నాన్ కాంపిటీటివ్ విధానంలో వాటిని కొనదలిచిన వారు అదే తేదీన ఉదయం 10: 30 నుంచి 11 గంటల మధ్య తమ బిడ్స్ను దాఖలు చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.












Click it and Unblock the Notifications