మొగల్తూరు ఘటనపై చర్చకు వైసీపీ పట్టు, వాయిదా పడిన ఏపీ అసెంబ్లీ
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు ఆనంద్ ఫుడ్ ఫ్యాక్టరీలో చోటుచేసుకొన్న ఘటనపై ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారం దద్దరిల్లింది. ఈ ఘటనపై చర్చకు వైసీపి పట్టుబట్టింది.
అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు ఆనంద్ ఫుడ్ ఫ్యాక్టరీలో చోటుచేసుకొన్న ఘటనపై ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారం దద్దరిల్లింది. ఈ ఘటనపై చర్చకు వైసీపి పట్టుబట్టింది. దీంతో సభ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయమేర్పడింది. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో రెండు దఫాలు స్పీకర్ సభను వాయిదా వేశారు.పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీలో చోటుచేసుకొన్న ఘటనలో ఐదుగురు మరణించిన ఘటనపై వైసీపి సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో స్పీకర్ తిరస్కరించారు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఆనంద్ ఫుడ్ ఫ్యాక్టరీలో గురువారం విషవాయువులు లీకైన ఘటనలో ఐదుగురు కార్మికులు మరణించారు. ఈ ఘటనపై శుక్రవారం నాడు వైసీపీ వాయిదా తీర్మాణం ఇచ్చింది.
అయితే వాయిదా తీర్మాణాన్ని స్పీకర్ తోసిపుచ్చారు. ఈ విషయమై చర్చకు వైసీపి సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు.

మొగల్తూరు ఆక్వా బాధితులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు వైసీపి సభ్యులు. అంతేకాదు ఆక్వాబాధితులను ఆదుకోవాలని ప్లకార్డులను ప్రదర్శించారు.
ఈ సమయంలో వైసీపి తీరును టిడిపి, బిజెపి పక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను తొలుత పది నిమిషాల పాటు వాయిదా వేశారు.
తర్వాత సభ ప్రారంభమైన తర్వాత కూడ మరోసారి వైసీపీ సభ్యులు గట్టిగా పట్టుబట్టి స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్ళారు. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
అక్వాప్లాంట్ ఘటనపై ప్రభుత్వం ప్రకటన చేస్తోందని, ఆ తర్వాత చర్చకు సిద్దమని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయమై మంత్రులు పదే పదే సభలో ప్రకటన చేశారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలని స్పీకర్ , ప్రభుత్వం కోరాడు. అయినా వైసీపి సభ్యులు ఆక్వా ఘటనపై చర్చకు పట్టుబట్టారు. దరిమిలా స్పీకర్ మరోసారి సభను వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications