ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూత
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎస్వీ ప్రసాద్ పెద్ద కుమారుడు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతుండగా, చిన్న కుమారుడు కరోనా నుంచి కోలుకుంటున్నారు.
ఐఐఎం అహ్మదాబాద్లో ఎంబీఏ పూర్తి చేసిన ఎస్వీ ప్రసాద్.. 1975 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్గా ఎస్వీ ప్రసాద్ తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత 1982లో కడప, 1985లో విశాఖపట్నం జిల్లాల కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం పలు ప్రభుత్వ శాఖలు, విభాగాలకు ఛైర్మన్, కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి స్థాయి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు ఎదిగారు.
2010లో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్వీ ప్రసాద్ సీఎస్గా పనిచేశారు. తన కంటే 20 మంది సీనియర్ అధికారులున్నా.. ఎస్వీ ప్రసాద్నే సీఎస్ పోస్టు వరించడం గమనార్హం. పదేళ్లకుపైగా ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద ప్రధాన కార్యదర్శిగా ప్రసాద్ విధులు నిర్వహించారు.
నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్వీ ప్రసాద్ సీఎస్గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో విజిలెన్స్ కమిషనర్ గా ప్రసాద్ పనిచేశారు. ప్రసాద్ మరణం పట్ల రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం తెలియజేశారు. ఎస్వీ ప్రసాద్ మరణం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయారు. ప్రసాద్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.