దీపావళి తర్వాతరోజు నుంచి మరో పథకాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభివృద్ధితోపాటు సంక్షేమానికి కూడా సమాన ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా మరో పథకాన్ని అమలు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 31వ తేదీన దీపావళి సందర్భంగా ఇంటింటికీ ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత రోజు నుంచే మరో పథకానికి శ్రీకారం చుడుతున్నారు.
వెల్లడించిన చిత్తూరు ఎమ్మెల్యే
ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఇచ్చిన హామీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. దీని అమలు సాధ్యాసాధ్యాలపై అధికారులు అధ్యయనం చేసి నివేదిక రూపొందించారు. దీపావళి తర్వాత రోజు నుంచి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వెల్లడించారు. అధికారికంగా ప్రభుత్వం ప్రకటన చేయనప్పటికీ ఎమ్మెల్యే వెల్లడించడంతో ఆరోజు నుంచి ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

నివేదిక రూపొందించిన అధికారులు
ఏపీకి పొరుగునే ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకం అమలవుతోంది. ఏపీకి చెందిన అధికారులు ఈ రెండు రాష్ట్రాల్లో పర్యటించి సాధ్యాసాధ్యాలు, ప్రభుత్వానికి ఎంత భారం పడుతుందనే విషయంపై చంద్రబాబుకు నివేదిక అందజేశారు. దీన్నిబట్టి ఆయన ఆ డబ్బును నేరుగా ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ఎటువంటి లోటుపాట్లకు తావివ్వకూడదనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి ఉన్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ పథకాన్ని విశాఖపట్నం నుంచే ప్రారంభిస్తామని గతంలోనే ప్రకటించారు. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త బస్సులను కూడా వివిధ జిల్లాలకు కేటాయించారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చిన అనంతరం ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు.












Click it and Unblock the Notifications