ఏపీ సర్కారు సంచలన నిర్ణయం: సీమాంధ్రులే కాదు, గడువులోగా ఎవరొచ్చినా స్థానికులే!
హైదరాబాద్/విజయవాడ: ‘స్థానికత' అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2017 మార్చి 31వ తేదీలోపు ఆంధ్రప్రదేశ్కు ఎవ్వరు, ఎక్కడి నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్నా... వారిని స్థానికులుగా గుర్తించాలని తీర్మానించింది.
అంటే ప్రస్తుతం హైదరాబాద్తోపాటు తెలంగాణలో ఉద్యోగాలు, వ్యాపారాల కోసం స్థిరపడిన సీమాంధ్రులే గాక, తెలంగాణతో సహా ఏ రాష్ట్రానికి చెందిన వారైనా 2017 మార్చి 31లోపు ఏపీలోని ఏ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరుచుకుంటే ఆ ప్రాంతానికి స్థానికులుగా గుర్తిస్తారు. వెరసి.. ప్రతి ఒక్కరికీ ‘నవ్యాంధ్రకు స్వాగతం' పలకాలని నిర్ణయించుకున్నారు.
ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి.. సీమాంధ్రులకు మాత్రమే స్థానికత ఇస్తామనే నిబంధన విధిస్తే, వారి పుట్టుపూర్వోత్తరాలను నిర్ధారించుకోవడం కష్టమవుతుంది. దీనివల్ల న్యాయపరమైన చిక్కులూ తలెత్తవచ్చు.

ఇంక రెండోదానికి వస్తే... కొత్త రాజధానితోపాటు సరికొత్త విద్యాసంస్థలు, కర్మాగారాలు భారీగా వస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఉన్న నిపుణులను స్వాగతించేందుకు ‘స్థానికత' ఒక ప్రోత్సాహంగా మారుతుంది.
ఈ మేరకు బుధవారం ‘స్థానికత'పై ప్రస్తుతం ఉన్న చట్టానికి సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 2017, మార్చి 31లోపు తన పరిధిలోకి వచ్చిన వారందరికీ ‘లోకల్' స్టేటస్ ఇస్తామని ఇటీవల ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం, అందుకనుగుణంగా పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టింది.
కాగా, నవ్యాంధ్రకు కొత్తగా వచ్చి, అక్కడి స్థానికత కోరుకున్న వారు దీనికోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తాము నవ్యాంధ్రలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నట్లు ఆధారాలు చూపాలి. దీనిని ధ్రువీకరించుకున్న తర్వాతే, అధికారులు ‘స్థానికత'కు సిఫారసు చేస్తారు. స్థిర నివాసం ఏర్పరచుకున్నారని ధ్రువీకరించుకునేందుకు వివిధ ప్రాతిపదికలను నిర్ణయిస్తారు.
ఇందుకు కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. హైదరాబాద్ తోపాటు ఇతర ప్రాంతాల్లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు 2017 నిబంధన పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల చదువులకు సంబంధించిన అనివార్యతను వివరిస్తూ దరఖాస్తు చేసుకున్న వారికి గడువును పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.












Click it and Unblock the Notifications