బాలకృష్ణ జైసింహకు 'అజ్ఞాతవాసి' ఆఫర్, పవన్ కళ్యాణ్ సినిమాపై జగన్ మీడియా ఇలా
అమరావతి: సినీ నటుడు, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ నటించిన జైసింహా చిత్రం ప్రత్యేక ప్రదర్శనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 16వ తేదీ ఉదయం పది గంటల వరకు చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు అనుమతి ఇస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ ఆదేశాలు ఇచ్చారు.
Recommended Video
థియేటర్ యాజమాన్యాలు జాయింట్ కలెక్టర్ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జైసింహా సినిమా శుక్రవారం (12వ తేదీన) విడుదలవుతున్న విషయం తెలిసిందే. 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు షోలకు అనుమతిచ్చారు. దీని ప్రకారం గురువారం అర్ధరాత్రి ఒంటి గంటకు మొదటి షో ప్రారంభమవుతుంది.
సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో
సంక్రాంతి పండుగ నేపథ్యంలో భారీ రద్దీని తట్టుకోవడంతోపాటు శాంతి భద్రతల సమస్యలు రాకుండా, సినిమా టిక్కెట్ల బ్లాక్ మార్కెట్ను అదుపు చేసేందుకు ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇచ్చినట్లు హోంశాఖ ముఖ్య కార్యదర్శి తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఇటీవలే అజ్ఞాతవాసికి ఆఫర్
ఇటీవలే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాకు ఏపీ ప్రభుత్వం మూడు అదనపు షోలకు అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి ఒకటి గంటల నుంచి ఉదయం పది గంటల వరకు షోలు వేసుకోవచ్చు. ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు షోలు సాధారణమే.
హాలు నిండే పరిస్థితి లేదని
ఇదిలా ఉండగా, అజ్ఞాతవాసికి ఏడు షోలకు అనుమతి ఇవ్వడంపై వైసీపీ అధినేత వైయస్ జగన్కు చెందిన సాక్షి పత్రిక విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి స్పందించింది. ఏకంగా ప్రభుత్వం నుంచి జీవో తెప్పించుకొని ఏడు షోలు వేసుకున్నా అజ్ఞాతవాసి సినిమాకు డివైడ్ టాక్ రావడంతో నాలుగు షోలకే హాలు నిండే పరిస్థితి లేదని పేర్కొంది. హైప్ క్రియేట్ చేసి భారీ అంచనాలతో రిలీజ్ చేసిన తొలి రోజు తప్ప ఆ తర్వాత ఏడు షోలకు టిక్కెట్లు తెగట్లేదని థియేటర్ సిబ్బంది చెబుతున్నారని రాసింది.
అల్లాడిపోతున్న ఉద్యోగులు
ఏడు షోలతో ఆయా సినిమాలు కలెక్షన్లు కొల్లగొట్టడం మాట పక్కన పెడితే థియేటర్ ఉద్యోగులు, సిబ్బంది మాత్రం అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు. సాధారణంగా రోజుకు నాలుగు షోలు ఆడే థియేటర్లో ఏడు షోలు ఓకేసారి ఆడించడంతో సిబ్బందిని మాత్రం యాజమాన్యాలు పెంచడం లేదని పేర్కొన్నారు. అదనపు షోలతో సిబ్బందిపై పని భారం పడిందని పేర్కొన్నారు. కాగా, నిన్న అజ్ఞాతవాసికి, నేడు జైసింహాకు ప్రత్యేక అనుమతి ఇవ్వడాన్ని మరో దోపిడీ షో అని కథనం రాశారు.