ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం...ఆగస్టు 1 నుంచి అమలు:ఉత్తర్వులు జారీ
అమరావతి:ఇప్పటివరకూ పాఠశాల విద్యార్థులకే పరిమితమైన మథ్యాహ్న భోజన పథకం ఇకపై ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం అందుబాటులోకి రానుంది. ఆగస్టు 1 నుంచి వారికి ఈ మధ్యాహ్నా భోజన పథకం అమలు చేయనున్నారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్దాస్ బుధవారం ఉత్తర్వులను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 450 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 1,74,683 విద్యార్థులకు ఈ పథకం అమలు కానుంది. 331 జూనియర్ కళాశాలలకు వాటికి అనుబంధంగా ఉన్న ఉన్నత పాఠశాలల నుంచి ఆహారం అందించడం జరుగుతుంది. మిగిలిన 119 కళాశాలలకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల నుంచి ఆహార సరఫరా చేస్తారు.
ఈ బాధ్యతలను కూడా కేంద్రీయ వంటశాలలకు, ఎన్జీవోలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ పథకానికి రూ.56.53కోట్లు రాష్ట్రప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఆహారం వండేందు కు రూ.23.75కోట్లు, కోడిగుడ్ల సరఫరా కోసం రూ.13.08కోట్లు, వంట వారికి, హెల్పర్లకు పది నెలలకు కలిపి రూ.1.90కోట్లు, రవాణ ఖర్చుల కింద రూ.17.80 కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయించింది.