చితకబాదినట్లు వీడియో: స్నేక్ గ్యాంగ్పై మరో కేసు
హైదరాబాద్: స్నేక్ గ్యాంగ్ అరాచాకాలపై సైబరాబాద్ పోలీసులు తాజాగా మరో కేసు నమోదు చేసింది. దంపతుల పంచాయతీలో భర్తను ఈ గ్యాంగ్ చితకబాదినట్లు తెలుస్తోంది. బాధితుడిని కర్రతో కొడుతున్న వీడియో ఆధారంగా హైదరాబాదులోని పహాడీ షరీఫ్ పోలీసులు స్నేక్ గ్యాంగ్పై కేసు నమోదు చేశారు.
స్నేక్ గ్యాంగ్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఇప్పటికే స్నేక్ గ్యాంగ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పహాడీ షరీఫ్ సీఐ భాస్కర్రెడ్డిపై బదిలీ వేటు పడగా, మరికొందరు పోలీసులపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
తనకు కాబోయే భర్తతో పాటు పామ్హౌస్కు వచ్చిన ఓ యువతిపై ఏడుగురు స్నేక్ గ్యాంగ్ సభ్యులు అత్యంత అమానుషమైన రీతిలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తర్వాత స్నేక్ గ్యాంగ్ ఆగడాలు ఒక్కటొక్కటే బయటకు వస్తున్నాయి.
యుపతిపై సామూహిక అత్యాచారం చేసిన తర్వాత నిందితులు ఫైసల్ దయానీ, ఖాదర్ బారక్బ, సలామ, పర్వేజ్, సయ్యద్ అన్వర్, ఖాజా అహ్మద్, మహ్మద్ ఇబ్రహీం పరారయ్యారు. వీరిలో ఖాదర్ బారక్బ, సయ్యద్ అన్వర్, ఖాజా అహ్మద్ 11న రంగారెడ్డి కోర్టులో లొంగిపోయారు. మరో ముగ్గురు నిందితులు సలామ, మహ్మద్ పర్వేజ్, మహ్మద్ ఇబ్రహీంలను పోలీసులు మూడో తేదీన అరెస్టు చేశారు.