పారిపోయిన మరో టీడీపీ అభ్యర్థి: సొంత జిల్లాలో చంద్రబాబుకు షాక్
Recommended Video
చిత్తూరు: తెలుగుదేశం పార్టీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గతంలో ఎప్పుడూ, ఏ పార్టీలో సంభవించని పరిణామాలను ఆ పార్టీ చవి చూస్తోంది. ఏరి కోరి, సర్వేలు చేసి మరీ ఎంపిక చేసిన అభ్యర్థులు తెలుగుదేశానికి జెల్ల కొట్టి పారిపోతున్నారు. మొన్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నిన్న బీసీ జనార్ధన్ రెడ్డి. ఇదే జాబితాలో మరో అభ్యర్థి కూడా చేరిపోయారు. అదీ- చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు నుంచే కావడం కలవరపాటుకు గురి చేస్తోంది. సొంత జిల్లాలో పార్టీ ఎలాంటి దీనస్థితికి చేరిందో చాటి చెబుతోంది.
తాజాగా- పూతలపట్టు తెలుగుదేశం అభ్యర్థి తెర్లాం పూర్ణం ఎన్నికల పోటీ నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్ణం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఆయనకు బీఫాం కూడా ఇచ్చింది. మరో రెండురోజుల్లో నామినేషన్ల పర్వం ముగియబోతున్న సమయంలో.. పూర్ణం- పార్టీ అగ్ర నాయకత్వానికి కోలుకోలేని దెబ్బ కొట్టారు. తాను పోటీ నుంచి తప్పుకొంటున్నాననే సంకేతాలు ఇచ్చారు. రెండురోజులుగా ఆయన పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనట్లేదని తెలుస్తోంది. నియోజకవర్గంలో పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉండటమే దీనికి కారణమని పూర్ణం వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. గెలిచే అవకాశాలు ఏ మాత్రం లేవని నిర్ధారణకు రావడం వల్లే పూర్ణం తప్పుకొన్నారనే సమాచారం.
ఆత్మగౌరవం కాపాడుకుందాం : కుట్రలను తిప్పి కొడుదాం: సీయం చంద్రబాబు పిలుపు..!
ఇదివరకు పూతలపట్టు నియోజకవర్గం ఇన్ ఛార్జిగా ఉన్న లలితా కుమారి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెబుతున్నారు. లలితా కుమారి టికెట్ ఆశించి భంగపడ్డారని, పూర్ణం అభ్యర్థిత్వాన్ని ఆమె మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం నియోజకవర్గంలో సాగుతోంది. ఇక- పూర్ణం తప్పుకోవడంతో లలితా కుమారికే టికెట్ ఇస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇక్కడో చిన్న ట్విస్ట్ ఏమిటంటే- అన్ని రకాల సర్వేలు నిర్వహించిన తరువాతే తెలుగుదేశం పార్టీ తెర్లాం పూర్ణం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. లలితా కుమారికి టికెట్ ఇస్తే, ఓడిపోవడం ఖాయమని నిర్ణయించుకున్న తరువాతే- పూర్ణంకు టికెట్ ఇచ్చింది.
కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ అసంతృప్తి జ్వాలలను ఎదుర్కొంటోండటం గమనార్హం. టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్.. పార్టీ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ కుమార్ ను కాదని ఎం ఎస్ బాబుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. దీనిపట్ల ప్రవీణ్ కుమార్ గుర్రుగా ఉంటున్నారని, పార్టీ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనట్లేదని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన వర్గీయులు ఎలా? ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరం. అభ్యర్థి గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ప్రవీణ్ కుమార్ కు అభిమానులు ఉన్నారని చెబుతున్నారు.