పోలవరం కిరికిరి: తెలంగాణపై ఎపి వ్యూహరచన

అథారిటీలో తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పిస్తే అందులో తమకూ చోటు ఇవ్వాలని ఒడిశా, ఛత్తీస్గఢ్ డిమాండ్ చేసే అవకాశముందని, దీని వల్ల ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఒకట్రెండు రోజుల్లో కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాయనున్నట్టు తెలిసింది.
ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్లో కలిపేసినందున పోలవరం జల విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్లో తెలంగాణకు వాటా ఇవ్వాల్సిన అవసరంలేదని కూడా కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ మేరకు ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లో సవరణలు జారీ చేయాలని కోరనుంది. పోలవరం అథారిటీ పరిధిని ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు మాత్రమే పరిమితం చేయాలని అభిప్రాయపడుతోంది.
ప్రపంచబ్యాంకు ఆర్థిక సాయం ఇచ్చే ప్రాజెక్టుల్లో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ను ఏర్పాటు చేసినట్లుగానే కేంద్రం పోలవరం ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తే సరిపోతుందని కేంద్రానికి సూచించాలని నిర్ణయించుకుంది. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శికి రాసే లేఖలో ఈ విషయాన్ని కూడా స్పష్టం చేయనుంది. పోలవరం అథారిటీని ఏర్పాటు చేస్తూ గత నెల 28వ తేదీన కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసింది. అథారిటీ గవర్నింగ్ బాడీలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ప్రాజెక్టు అథారిటీలో తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, పునరావాస కమిషనర్లకు చోటు కల్పించింది.












Click it and Unblock the Notifications