ముప్పేట దాడి: ఆత్మరక్షణలో వైయస్ జగన్

హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనుసరిస్తున్న వ్యూహంపై ముప్పేట దాడి జరుగుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు మాత్రమే కాకుండా కాంగ్రెసు నాయకులు కూడా ఆయన తీరుపై విమర్సలు గుప్పిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతాన్ని వదులుకుని సమైక్యాంధ్ర నినాదం చేస్తూ, సమైక్య యాత్రలు చేస్తున్న వైయస్ జగన్ను అసలు సిసలు విభజనవాదిగా ఆ పార్టీ అభివర్ణిస్తున్నాయి. దీంతో ఆయన ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నారు.
రాష్ట్ర విభజన త్వరగా జరగిపోవాలనేది జగన్ ఉద్దేశ్యమని, అందుకే చర్చకు ఇంత సమయం తీసుకుంటారా, ఒక్క రోజులో అయిపోదా అని జగన్ అన్నారని ప్రత్యర్థులు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. శానససభ సమావేశాలను ఉదయం పూట అడ్డుకుని, ఆ తర్వాత వాకౌట్ చేసి చర్చకు వీలు కల్పించే వైఖరిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనుసరిస్తోంది. శుక్రవారం నాడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు వాకౌట్ చేసి సభ నుంచి వెల్లిపోయిన తర్వాత కాంగ్రెసుకు చెందిన మంత్రులు ఆనం నారాయణ రెడ్డి, శైలజానాథ్లతో పాటు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు ఆ పార్టీపై విమర్శలు చేశారు.
ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని జగన్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారని ఆయన అన్నారు. దానికి తోడు, ఆయన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని కూడా లక్ష్యం చేసుకుని వ్యాఖ్యలు చేశారు. విభజనకు వైయస్ రాజశేఖర రెడ్డి బీజం వేశారని వారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాను వ్యతిరేకిని కానని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వైయస్ శాసనసభలో అధికారికంగా ప్రకటన చేశారని వారు గుర్తు చేశారు.
అన్ని పార్టీలు తనను లక్ష్యం చేసుకోవడంతో జగన్ రాష్ట్ర రాజకీయాల్లో ఒంటరిపోరాటం చేయాల్సిన స్థితిలో పడ్డారు. మరోవైపు, చాలా కాలంగా మౌనంగా ఉంటూ వచ్చిన ఒకప్పటి జగన్ సహచరుడు, కాంగ్రెసు తిరుగుబాటు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పార్టీ, పత్రిక కూడా పతనావస్థలో ఉన్నాయని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి 24 గంటల తర్వాత గానీ ప్రతిస్పందన రాలేదు. అది కూడా పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి తప్పదన్నట్లుగా మాట్లాడినట్లు అనిపించింది.
తన పార్టీలోకి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వరదలా వచ్చి చేరుతారని భావించిన జగన్కు నిరాశే ఎదురవుతోంది. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై అలక వహించేవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా, మాజీ మంత్రి మారెప్ప జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొద్ది మంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. విభజన కారణంగా అసంతృప్తికి గురైన సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఇష్టపడుతున్నారే తప్ప వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి ఇష్టపడడం లేదు.
వైయస్ జగన్ కాంగ్రెసుతో కలిసిపోయారనే వాదనకు క్రమంగా బలం చేకూరుతోంది. జగన్ కాంగ్రెసు అధిష్టానంతో కలిసిపోయి జైలు నుంచి బయటపడ్డారని తెలుగుదేశం పార్టీ వాదిస్తూ వస్తోంది. అదే వాదనను రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు కూడా చేస్తున్నారు. తాజాగా, సబ్బం హరి వ్యాఖ్యలు ఆ వాదనకు మరింత బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. ఏ పరిస్థితిలో కాంగ్రెసుకు మద్దతు ఇస్తానని జగన్ అన్నారో తనకూ మేకపాటి రాజమోహన్ రెడ్డికీ తెలుసునని ఆయన అన్నారు. సబ్బం హరి మాటల్లోని ఆంతర్యం అందరికీ అర్థమైపోతూనే ఉన్నది.
సమైక్యాంధ్ర నినాదంతో సీమాంధ్ర హీరోగా అవతరించాలని భావించిన జగన్కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నుంచి కూడా ప్రతిఘటన ఎదురవుతోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని పక్కన పెడితే విభజనపై కాంగ్రెసు అధిష్టానాన్ని కూడా వ్యతిరేకిస్తన్న కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదిగా జగన్ కన్నా ఎక్కువ మార్కులు కొట్టేసే అవకాశాలు కూడా లేకపోలేదు. సమైక్య నినాదంతో జగన్ చేపట్టిన కార్యాచరణ విభజనకు అనుకూలంగా ఉందనే వాదనను ముఖ్యమంత్రి వర్గానికి చెందిన నాయకులు, తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు బలంగా ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఏమైనా, జగన్పై అన్ని పార్టీల నుంచి రాజకీయ దాడి జరుగుతోంది. జగన్ దీని నుంచి ఎలా బయటపడుతారనేది భవిష్యత్తు మాత్రమే తేలుస్తుంది.












Click it and Unblock the Notifications