నేటి భేటీ కేబినెట్ వాయిదా - రేపు అసెంబ్లీ..ఐఏఎస్ ల బదిలీ : ఏం జరుగుతోంది..!!
ఏపీ ప్రభుత్వంలో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు జరగాల్సిన కేబినెట్ భేటీ ఆకస్మికంగా వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశానికి ముందు కేబినెట్ నిర్వహించాలని నిర్ణయించారు. అజెండా సైతం ఫిక్స్ చేసారు. సభలో అనుసరించాల్సి వ్యూహాలు.. తదితర అంశాలపై కేబినెట్లో చర్చించాలని భావించారు. అయితే, కేబినెట్ భేటీని రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ మేరకు అధికారికంగా వెల్లడించారు.

ఐఏఎస్ ల బదిలీలు
అయితే, బిల్లులు కొత్తగా ఆమోదించాల్సినవి లేకపోవటంతో వాయిదా వేసారని తెలుస్తోంది. ఇక, గురువారం అసెంబ్లీ - మండలి సమావేశం కానున్నాయి. ఇదే సమయంలో సీనియర్ ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్థరాత్రి సీఎస్ సమీర్శర్మ ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. జవహర్రెడ్డికి తితిదే ఈవోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా జె.శ్యామలరావును, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా సాయిప్రసాద్ను, ఆహార శుద్ధి కార్యదర్శిగా ఉన్న ముఖే్షకుమార్ మీనాను వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు.

జవహర్ రెడ్డికి నీటి పారుదల శాఖ
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడిని గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులుగా బదిలీ చేశారు. పాఠశాల విద్య నూతన డైరెక్టర్గా ఎస్.సురేశ్కుమార్ను నియమించారు. సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీగా రంజిత్ బాషా, చేనేత సంక్షేమ శాఖ సంచాలకులుగా సి.నాగమణి, బీసీ సంక్షేమ శాఖ సంచాలకులుగా పి.అర్జున్రావును బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం ఒక్క రోజే శాసన సభ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 19వ తేదీకి సభ జరిగి ఆరు నెలల సమయం పూర్తవుతుంది. ఆరు నెలల్లోగా ఖచ్చితంగా సభ తిరిగి సమావేశం కావాల్సి ఉంటుంది.

ఒక్క రోజే అసెంబ్లీ సమావేశం
గురువారం ఉదయం బీఏసీ సమావేశం ఏర్పాటు చేసి అందులో సభ నిర్వహణ పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఒక్క రోజు సమావేశమే అయితే బహిష్కరించాలని టీడీపీ ఆలోచనగా తెలుస్తోంది. ముఖ్యమైన బిల్లులు ఆమోదించుకోవాల్సి ఉన్నందున గురువారం ఒకరోజు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చే నెల లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక మరోదఫా శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒక్కరోజు నిర్వహించే అసెంబ్లీలో మొత్తం 14 ఆర్డినెన్సులను బిల్లుల రూపంలో ఆమోదించనున్నారు.
Recommended Video

కీలక బిల్లులకు అసెంబ్లీలో ఆమోదం కోసం
రాష్ట్ర వ్యవసాయ భూచట్ట సవరణ, ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్టు సవరణ, ఏపీ పంచాయతీరాజ్ చట్ట సవరణ, ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ, మానిటరింగ్ కమిషన్ యాక్ట్, ఏపీ విద్యా చట్ట సవరణ, ఏపీ చారిటబుల్, హిందూ రెలిజియస్ ఇన్స్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్టు సవరణ, ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ యాక్ట్ సవరణ, ఏపీ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్, ఏపీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కో-కంట్రిబ్యూషన్ పెన్షన్ యాక్ట్ సవరణ, ఏపీ మున్సిపల్ కార్పొరేషన్స్ యాక్ట్ సవరణ, ఏపీ సినిమా నియంత్రణ చట్ట సవరణలకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. ఏపీ ప్రభుత్వం లో పాలనా పరంగా డిసెంబర్ మాసంలో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications