బాబు 'మనీ' ప్లాన్: రాజధాని ప్రాంతం లీజుకు, భూములకు మళ్లీ గిరాకీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతమైన అమరావతిలోని భూమిని ప్రభుత్వం 99 ఏళ్ల పాటు ప్రయివేటు పార్టీలకు లేదా జాయింట్ కాపిటల్ ఇన్వెస్టర్స్కు లీజుకు ఇవ్వవచ్చు. ఈ భూములను ఇవ్వడం ద్వారా పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకోవచ్చునని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది.
రాజధాని ప్రాంతంలో ఆకాశాన్ని అంటుతున్న ధరలు
రాజధానికి భూమి పూజ చేసే ముహూర్తం ఖరారు కావడం, కృష్ణా జిల్లాలోనూ రాజధానికి భూముల సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేయడంవంటి కారణాలతో మార్కెట్లో మళ్లీ ధరలు పెరగడం ప్రారంభమైంది. కృష్ణా జిల్లాలో కూడా నదీతీరంలో 8 వేల ఎకరాలు భూసమీకరణ కింద తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.

దీంతో, మూడు మండలాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నవ్యాంధ్ర రాజధానిగా తుళ్లూరును ప్రకటించిన వెంటనే అక్కడ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఎకరా భూమి ఏకంగా కోటిన్నర రూపాయల వరకు చేరుకున్నాయి. అప్పట్లో సుమారు నెలపాటు సాగిన పెరుగుదల క్రమేణా తగ్గుతూ వచ్చింది.
ఎకరం తిరిగి కోటి రూపాయలకు వచ్చేసింది. పది రోజుల కిందటి వరకు ఎకరా ధర మెట్ట ప్రాంతాల్లో 80 నుంచి 90 లక్షల వరకు, జరీబు భూముల్లో కోటీ పది లక్షల వరకు పలికింది. అకస్మాత్తుగా 15 రోజుల నుంచి ధరలు పెరగడం ప్రారంభమైంది.
కొనుగోలుదారులు కూడా పెద్దఎత్తున తరలి వస్తున్నారు. భూసమీకరణ కింద భూములు ఇచ్చినా అమ్ముకునే అవకాశం కల్పించడంతో రైతులు కూడా సిద్ధపడుతున్నారు. కొనుగోలుదారులు కూడా సీఆర్డీఏ అధికారులను సంప్రదించి మరీ కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో రేట్లు మళ్లీ పెరిగాయి.
కృష్ణా జిల్లాలో నదీతీరానికి కూడా రాజధాని సెగ తగిలింది. జిల్లాలో ఎనిమిది వేల ఎకరాల వరకు రాజధాని నిర్మాణానికి సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నదీతీరంలో ఉన్న కంచికచర్ల, నందిగామ, చందర్లపాడు మండలాల్లో ధరలు పెరిగాయి.












Click it and Unblock the Notifications