ప్రధాని మోడీకి చంద్రబాబు వినతులివే-గంట భేటీలో వీటిపైనే చర్చ..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. సాయంత్రం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు నేరుగా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోడీతో ఆయన చర్చలు జరిపారు. దాదాపు గంటసేపు జరిగిన చర్చల తర్వాత చంద్రబాబు ఇతర కేంద్రమంత్రుల్ని కలిసేందుకు బయలుదేరి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి చంద్రబాబు తిరుమల లడ్డూను అందించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం పెండింగ్ సమస్యలుగా ఉన్న అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం, పోలవరం జాతీయ ప్రాజెక్టుకు సాయం, విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేసే ప్రతిపాదనపై ప్రధాని మోడీతో చంద్రబాబు చర్చించారు. ప్రపంచ బ్యాంక్ రుణంపై సూత్రప్రాయంగా ఆమోదం లభించిన నేపథ్యంలో కేంద్రం వైపు నుంచి తీసుకోవాల్సిన ఇతర చర్యలపై చంద్రబాబు చర్చించారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు తాజాగా ప్రతిపాదించిన రీయింబర్స్ మెంట్ మొత్తం విడుదలపైనా చర్చలు జరిగాయని తెలుస్తోంది.

దీంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా సెయిల్ లో విలీనం చేసేందుకు వచ్చిన ప్రతిపాదనల్ని ఆమోదించేలా చంద్రబాబు ప్రధాని మోడీని కోరినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలో కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఇన్ ఫ్రా ప్రాజెక్టులకు కావాల్సిన సాయంపైనా చంద్రబాబు ప్రధాని మోడీ ముందు ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తోంది. వీటిపై ఇతర కేంద్రమంత్రులతో మాట్లాడాలని ప్రధాని మోడీ సూచించినట్లు సమాచారం. రేపు కూడా చంద్రబాబు ఢిల్లీలోనే ఉండి పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతారు.












Click it and Unblock the Notifications