
జగన్ వద్దకు కన్నీళ్లతో వచ్చిన దంపతులు.. ఆనంద భాష్పాలతో..(వీడియో)
కడప: తన వద్దకు కన్నీళ్లతో వచ్చిన దంపతులకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నిరుపేద బిడ్డ .. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్కు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని .. మీరు నిశ్చితంగా ఉండాలంటూ తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా కల్పించారు. శుక్రవారం సీఎం స్వంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ సన్నివేశం బిడ్డ తల్లిదండ్రుల కంట ఆనందబాష్పాలు తెప్పించగా , సీఎం తక్షణ స్పందనకు అక్కడున్న ప్రజాప్రతినిధులు , అధికారులు చలించిపోయారు.

మూడున్నరేళ్లకే లివర్ దెబ్బతిన్న చిన్నారితో తల్లిండ్రులు
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచర్లకు చెందిన దివాకర రెడ్డి దంపతుల కుమారుడు యుగంధర్ రెడ్డికి మూడున్నర సంవత్సరాల చిరు ప్రాయంలోనే లివర్ దెబ్బతింది. చాలా మంది వైద్యుల వద్దకు తిరిగారు. వైద్యుల సూచనలతో బెంగుళూరులోని సెయింట్ జాన్ ఆస్పత్రికి వెళ్లారు. ఏడు నెలలపాటు తిరిగి అన్ని పరీక్షలు చేయించారు.

జగన్ వద్దకు కన్నీళ్లతో చిన్నారి తల్లిదండ్రులు
లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని , పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు . పేదలైన దివాకర్ రెడ్డి కుటుంబం అంత పెద్ద మొత్తంలో వెచ్చించలేని స్థితి. ఈ క్రమంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిని వెంకట్రామిరెడ్డిని కలిశారు. ఆయన శుక్రవారం లింగాల మండలం పార్నపల్లెకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు బాధిత కుటుంబాన్ని తీసుకుని వచ్చారు .
చిన్నారి తల్లిదండ్రులకు సీఎం జగన్ భరోసా
దివాకర రెడ్డి దంపతులు తమ కుమారుడి అనారోగ్య పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు . వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని , మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ వారికి భరోసా ఇచ్చారు .
తక్షణమే బాలుడికి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజును ఆదేశించారు . దీంతో దివాకర్ రెడ్డి దంపతులు ఆనంద బాష్పాలతో ముఖ్యమంత్రికి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు.