గురుకులాల్లో 1010 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆదేశం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో శుభవార్త అందించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న 1010 పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నవంబర్ 18న గురుకులాలు, వసతి గృహాలు, అంగన్ వాడీ కేంద్రాల్లో నాడు-నేడు పనులపై జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం జగన్ ఈ మేరకు ఆదేశించారు.
వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న 759 సంక్షేమాధికారి పోస్టులు, 80 కేర్ టేకర్ పోస్టులు, గిరిజన గురుకులాల్లోని 171 వసతి గృహ అధికారులను నియమించాలని స్పష్టం చేశారు. పోస్టు మెట్రిక్ వసతి గృహాల్లో నాలుగో తరగతి ఉద్యోగుల నియామకంపైనా దృష్టి పెట్టాలని చెప్పారు.
గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో మూడుదశల్లో నాడు-నేడు కార్యక్రమం నిర్వహించాలన్నారు. తొలి విడత పనులు వచ్చే జనవరి నుంచి ప్రారంభించి, ఏడాదిలోగా పూర్తి చేయాలన్నారు.
గురుకుల పాఠశాలలు, వసతి గృహాలన్నీ కలిపి 3,013 చోట్ల పనులు చేపట్టాల్సి ఉంటుందన్నారు. సమస్యలుంటే ఫిర్యాదుల కోసం కేంద్రాల్లో ప్రత్యేక నంబరు పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ పనులు పూర్తి చేయడానికి మొత్తంగా రూ.3,364 కోట్ల వరకు అవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.