విజయవాడ నుంచే పాలన: జూన్ కల్లా అన్ని కార్యాలయాల తరలింపు
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి విజయవాడకు కార్యాలయాల తరలింపు ప్రక్రియను 2016 జూన్కల్లా పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ నుంచి అన్ని కార్యాలయాలు, హెచ్వోడీలు అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించడానికి సమాయత్తం కావాలని, దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడానికి మరో సమావేశం ఏర్పాటు చేస్తామని కృష్ణారావు స్పష్టంచేశారు.
గురువారం ఆయన వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సమాయత్తం, ఇ-కార్యాలయం విధానం అమలు, ఆధార్ అనుసంధాన పరిస్థితి, రెండంకెల వృద్ధి, కీలక రంగాల్లో ప్రభుత్వ పనితీరు గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ అనిల్సింఘాల్తోనూ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్న అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. రెసిడెంట్ కమిషనర్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో ఆర్ఏఎఫ్(ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్) ఏర్పాటు, తిరుపతిలో రాష్ట్రస్థాయి క్యాన్సర్ సంస్థ, నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్, జాతీయ జల రవాణా అభివృద్ధి అంశాలు కేంద్రంలో ఏయే స్థాయిల్లో ఉన్నవనేదానిపై వివరించారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. గుంటూరు జిల్లాలో ఎయిమ్స్కు సమీపంలో జాతీయ ఆయుర్వేదిక్ కేంద్రం ఏర్పాటు చేసేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తాత్కాలిక ప్రాతిపదికన వైద్యులను నియమించుకునే అధికారాలను జిల్లా కలెక్టర్లకు ఇవ్వాలని సూచించారు.
జిల్లా కార్యాలయాల్లో దస్త్రాల కంప్యూటీకరణ అంశాన్ని పరిశీలించడానికి ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్, ఐటీ అధికారుల నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేయాలని ఆదేశించారు.
విజయవాడలో కార్యాలయాలకు ఇబ్బందిగా ఉన్న దృష్ట్యా హెచ్ఓడీలు అందరూ ఒకే చోట, కార్యదర్శులు అందరూ ఒకేచోటా ఉండడం కుదరదని, అందుకు సహకరించాలని సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కోరారు.












Click it and Unblock the Notifications