జగన్ జడ్ భద్రతపై గందరగోళం, తొలగించలేదని ఏపీ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి 'జడ్' కేటగిరీ భద్రతను తొలగించలేదని ఆంధ్రప్రదేశ్ అడ్వోకేట్ జనరల్ (ఏజీ) హైకోర్టుకు మంగళవారం తెలిపారు. ఆ వివరాలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వం దురుద్దేశ్య పూర్వకంగా ఈ నెల 13వ తేదీ నుండి భద్రతను తగ్గించిందని జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సీతారామమూర్తి వాదనలు వినిపించారు. ముందస్తు నోటీసులు జారీ చేయకుండా జడ్ కేటగిరి భద్రతను ప్రభుత్వం తగ్గించిందని చెప్పారు. దానికి న్యాయమూర్తి స్పందిస్తూ భద్రతను తొలగించినట్లు ఉత్తర్వులేవని ప్రశ్నించారు.
ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండానే కుదించారని, ఈ నెల 13 నుండి సిబ్బందిలో కొంతమంది విధులకు హాజరు కావడం లేదని న్యాయవాది బదులిచ్చారు. ఏజీ జోక్యం చేసుకుంటూ.. పిటిషనర్కు జడ్ కేటగిరీ భద్రతను తొలగించలేదని కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి ఈ పిటిషన్ పైన విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు, ప్రకాశం జిల్లా ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి 2 ప్లస్ 2 భద్రతను పునరుద్ధరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఆయనకు 1 ప్లస్ 1 భద్రత ఉందని, మరోవైపు సుబ్బారెడ్డి ప్రాణహాని ఉన్న వ్యక్తుల జాబితాలో లేరని ఏజీ తెలిపారు. కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కోరారు. దీంతో 2 ప్లస్ 2 భద్రత పునరుద్ధరణకు నిరాకరించారు. తదుపరి విచారణ 23వ తేదీకి వాయిదా వేశారు.