ఫలించని బుజ్జగింపులు- నిమ్మగడ్డపై హైకోర్టుకు ఉద్యోగులు ? జీహెచ్ఎంసీ అనుభవాలతో
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలను ఎట్టిపరిస్ధితుల్లో వాయిదా వేయించాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని ఎలాగైనా అమల్లో పెట్టేందుకు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ప్రకటించిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను అమలు చేసేందుకు సిద్ధంగా లేమని ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగ సంఘాలు.. నానాటికీ ధిక్కార స్వరాన్ని పెంచుతున్నాయి. తాజాగా ఏపీ ఉద్యోగులకు మంచి పేరు ఉందని, వారి భద్రతపై తమకు అందిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఈసీ చెప్పినా ఆయన వాదన వినేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధంగా లేరు. దీంతో న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు.

ఉద్యోగులకు నిమ్మగడ్డ విజ్ఞప్తి
కరోనా క్రమంగా అదుపులోకి వచ్చినందున ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే బీహార్తో పాటు తెలంగాణలోని జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికలు సజావుగా జరిగాయని ఉద్యోగులకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ గుర్తుచేశారు. ఏపీలో ఉద్యోగులకు మంచి పేరు ఉందని, వారిలో కరోనా భయాలు ఉన్నందున తగిన భద్రత ఏర్పాటు చేస్తామని ఉద్యోగులకు నిమ్మగడ్డ తెలిపారు. ఎన్నికలను బహిష్కరించారన్న చెడ్డపేరు ఉద్యోగులు తెచ్చుకోవద్దంటూ నిమ్మగడ్డ కోరడం సంచలనం రేపింది. గతంలో ఏ రాష్ట్రంలోనూ ఎన్నికలకు సహకరించాలని ఉద్యోగులను ఎన్నికల కమిషన్ ఇలా బతిమాలుకున్న సందర్భాలు లేకపోవడమే ఇందుకు కారణం.

నిమ్మగడ్డ విజ్ఞప్తి తోసిపుచ్చిన ఉద్యోగ సంఘాలు
ఎన్నికలను సహకరించాలని ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ రమేష్ చేసిన విజ్ఞప్తిని ఉద్యోగ సంఘాలు తోసిపుచ్చాయి.కరోనా ప్రభావం ఉన్నందున ఇప్పుడే ఎన్నికలు వద్దంటూ తాము రెండు నెలలుగా కోరుతున్నామని, ఇప్పుడు నిమ్మగడ్డ ఎన్నికలకు సిద్ధం కావాలని తమను కోరడం ఆశ్చర్యంగా ఉందని వారు చెప్తున్నారు. దీంతో సహజంగానే నిమ్మగడ్డ డిమాండ్ సమంజసంగా లేదని, దానికి తాము అంగీకరించబోమని ఏపీఎన్జీవోలు, ఏపీజేఏసీ సహా పలు ఉద్యోగ సంఘాలు తేల్చిచెప్పేశాయి. ఉద్యోగ సంఘాల స్పందన నేపథ్యంలో నిమ్మగడ్డ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

నిమ్మగడ్డ చర్యలకు దిగితే హైకోర్టుకు
స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో ముందు నుంచీ ప్రభుత్వ వాదననే మోస్తున్న ఉద్యోగ సంఘాలు తనకు ఎలాగో సహకరించవన్న అంచనాకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వచ్చేశారు. అయితే నేరుగా ఎన్నికల విధుల్లో పాల్గొనబోమంటూ ఉద్యోగ సంఘాలు రాతపూర్వకంగా తన దృష్టికి తీసుకువస్తే అప్పుడు చర్యలు చేపట్టేందుకు నిమ్మగడ్డ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఎన్నికల సంఘం చర్యలకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో ఎన్నికలు వద్దని తాము ఎప్పటి నుంచో కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వంపై పంతం కొద్దీ నిమ్మగడ్డ ఎన్నికలకు వెళ్తున్నారని వారు హైకోర్టుకు చెప్పబోతున్నారు.

జీహెచ్ఎంసీ అనుభవాలతోనే
గతేడాది చివర్లో హైదరాబాద్ మహానగరపాలక సంస్ధ జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు వాటిని కూడా కారణంగా చూపుతూ నిమ్మగడ్డ రమేష్ ఏపీలో స్ధానిక ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఉద్యోగులకు కూడా అదే చెప్తున్నారు. కానీ ఆ ఎన్నికల తర్వాత పలువురు ఉద్యోగులు కరోనా బారిన పడిన విషయాన్న ప్రస్తావించడం ద్వారా ఆయన వాదనకు కౌంటర్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ప్రస్తావన తెస్తే దానికి కరోనా బారిన ఉద్యోగుల అనుభవాలతో కౌంటర్ ఇచ్చేందుకు ఉద్యోగ సంఘాలు పక్కా స్కెచ్ రెడీ చేసుకుంటున్నాయి. అదే జరిగితే దానికి నిమ్మగడ్డ కౌంటర్ ఏంటన్నది చూడాల్సి ఉంది.
-
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications