అనకాపల్లిలో పెద్దపులి కోసం యూపీ బోను రెడీ-ఇవాళ పట్టుబడే అవకాశం !
అనకాపల్లి జిల్లాలో ఆరు వారాల నుంచి సంచరిస్తూ, అటవీ శాఖ అధికారులు, సిబ్బందిని ముప్పుతిప్పులు పెడుతున్న పెద్దపులిని బంధించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల కనిపించి మాయమవుతున్న ఈ పులి పశువులపై దాడులు చేస్తోంది. దీంతో స్ధానికంగా జనం భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా పులిని బంధించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.
ఈ పెద్దపులిని బంధించేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి పెద్ద బోనును అధికారులు తెప్పించారు. దీనిని కె.కోటపాడు మండలం చౌడువాడలో ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లాలో నుంచి జూన్ చివరి వారంలో అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి.. పాయకరావుపేట, ఎలమంచిలి, అనకాపల్లి, చోడవరం, పెందుర్తి, మాడుగల అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో సంచరిస్తూ, పశువులపై పంజా విసురుతోంది. దీంతో పదికిపైగా ఆవులు, గేదెలు, మేకలు చనిపోయాయి.

దీంతో గతంలో పలుమార్లు పులిని బంధించడానికి అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటుచేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోన్లు చాలా చిన్నవిగా వుండడంతో పెద్దపులి బోను సమీపంలోకి వస్తున్నప్పటికీ, లోపలికి వెళ్లడంలేదు. మరోవైపు పశువులపై పులి దాడులు పెరిగిపోతుండడంతో రైతులు తీవ్రభయాందోళన చెందుతున్నారు. పెద్దపులిని త్వరగా బంధించాలని, లేకపోతే మనుషులపైనా దాడి చేసే ప్రమాదం వుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పెద్దపులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు బుధవారం ఉత్తరప్రదేశ్ నుంచి పెద్దబోనును తెప్పించారు. దీనిని కె.కోటపాడు మండలం చౌడువాడ సమీపంలోని నల్లగొండ అటవీ ప్రాంతంలో ఇటీవల పశువులపై దాడి చేసిన ప్రదేశంలో ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications