ఏపీలో బియ్యం కార్డు తిరస్కరించారా ? మళ్లీ దరఖాస్తు చేసుకోండిలా...
ఏపీలో బియ్యం కార్డు లబ్దిదారుల జాబితాలో మరోసారి సవరణలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. గతంలో బియ్యంకార్డుకు దరఖాస్తు చేసుకున్న వారిలో పలువురి పేర్లు గల్లంతైన నేపథ్యంలో మరోసారి వారికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవశకం సర్వే ద్వారా గతంలో తెల్ల రేషన్ కార్డులు తిరస్కరించబడిన లబ్దిదారులు మళ్లీ కార్డు పొందేందుకు వాస్తవ ఆధారాలతో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగులు, కారు ఉన్నవారు, ఆదాయపన్ను చెల్లింపుదారులు, పరిమితికి మించి సొంత భూమి కలిగిన వారు, అత్యధిక యూనిట్లలో విద్యుత్ వాడకం దారులు, బహుళ బంధుత్వాలు కలిగిన వారు బియ్యం కార్డులు పొందేందుకు అనర్హులుగా తేల్చారు. వీరు మినహా మిగిలిన వారు తగిన ఆధారాలతో మరోసారి బియ్యంకార్డు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. తెల్ల రేషన్ కార్డు పొందేందుకు గతంలో అనర్హత కలిగిన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు సదరు కుటుంబంలోని ప్రతీ ఒక్కరి ఆధార్కార్డును రేషన్ కార్డు దరఖాస్తుతో కలిపి సమీపంలోని సచివాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తమ వద్దకు వచ్చిన దరఖాస్తులను ఆరుదశల్లో మూల్యాంకనం చేసి అర్హులను నిర్ధారిస్తారు. కాబట్టి గతంలో ఏదైనా కారణాల వల్ల అర్హులను అనర్హులుగా నిర్ధారిస్తే వారికి ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.